24, మార్చి 2012, శనివారం

జగన్ శక్తి......ఉపయెన్నిక ఫలితాలు.

కోవూరు ఉప ఎన్నికలలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం సాధించడం జగన్ కు ఏనుగంత బలాన్నిచ్చి ఉండాలి. నిజానికి ఇది వై.యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీకి పరీక్షే. ఇది ఓ రకంగా నెల్లూరు జిల్లా ప్రజానాడి అని నా నమ్మకం.గెలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇక్కడ ఘోరంగా వోడిపోయింది మాత్రం కాంగ్రెస్ -ఐ. కారణం రాజశేఖరరెడ్డి గతించిన తరువాత కాంగ్రెస్ - ఐ కి అందరూ సోనియాగాంధీ తెచ్చిపెట్టిన కీలుబొమ్మలే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా మరెవరున్నా ఈ ఫలితం ఇలాగే వుండేది. ఇది కిరణ్ వైఫల్యమనడం కంటే కాంగ్రెస్ చేజేతులా జగన్ ను దూరం చేసుకున్న ఫలితమనవచ్చు. ఈ విషయం కిరణ్ కుమార్ రెడ్డికి మనందరికంటే బాగానే తెలుసు. ఇది పూర్తిగా సోనియాగాంధీ వైఫల్యమేనని. దానికి తోడు సి.బి.ఐ యెన్క్వైరీ పేరిట "టార్గెట్ జగన్" ఆపరేషన్, దానికి ప్రతిపక్షాల అండదండలు, పచ్చ పత్రికల వికటాట్టహాస వింత వార్తలు మరింత ఆజ్యాన్ని పోసాయి.

రెండేళ్ళ క్రితం "ఓదార్పు యాత్ర" తన తండ్రి చనిపోయిన తర్వాత బాధపడ్డ కుటుంబాలను ఓదార్చడానికి మొదలైన యాత్ర క్రమేణా నిజమైన "ఓదార్పు యాత్ర" గా మారింది. నిజమే. నిజమైన ఓదార్పు యాత్రే! కారణం ఈనాడు ప్రజల సమస్య లమీద పోరాడుతున్న పార్టీ, నాయకుడూ ఎవరైనా వున్నారంటే అది YSR party మరియు జగన్ మాత్రమే.

అవినీతికి విలువెంత? ఎక్కడ ఏదేశంలో అవినీతి లేదు? అది ఈరోజు మనం పారద్రోలగలమా? ఎవరు అవినీతికి పాల్పడరు? అసలు అవినీతి లేని వాడు రాజకీయాల్లో ఉండగలడా? ఈ ప్రశ్నలకు బ్లాగుల్లో,పేపర్లో టపాలు వ్రాయడం చాలా సులభమే. ప్రొద్దున లేస్తే సార్ పిల్లోడికి ఇస్కూల్ లో చేర్చడానికి S.C/S.T certificate కావాలని అభ్యర్థింవే ఛోటా మోటా నాయకుడి వద్దనుంచి టెండర్ల పైరవీలు చూసే M.P లు, వారికి అధినాయకుడైన ముఖ్యమంత్రులూ ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. మన ఒక్క చంద్రబాబు తప్ప. ఎందుకంటే వారు నీతిమంతులైన నాయకులు. ఈ విషయం ప్రతి పౌరునికీ తెలుసు. కానీ ప్రతి వ్యక్తీ తన ముడ్డి తెలుపే అనుకొని వాదులాడుతుంటాడు. నిజానికి ఈ అవినీతిని తుడిచి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు కానీ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రము ఖచ్చితంగా వుండాల్సిందే. కోర్టులు ప్రత్యామ్నాయమా? హబ్బే ఆ రోజులు ఎప్పుడో దాటేసాము మనం. చూస్తుంటే తెలియటంలా? మరి ఎలా? ఓటరే దానికి ప్రత్యామ్నాయం. ఓటరు కు కావలసినదేమిటో వాడికి మనకంటే బాగా తెలుసు. వీడు కాకపోతే వచ్చేవాడు, మనకేమీ ప్రయోజనం చేకూర్చకుండా పూర్తిగా వాడే దోచేసుకుంటాడనీ తెలుసూ. దాని ఫలితమే కోవూరు ఉప యెన్నిక ఫలితం.

ఎలక్షన్ లో గెలవాలంటే సగం మందికన్నా ఎక్కువ మంది ఓటెయ్యాలి. అంటే రెండు గ్రూపులు తప్పనిసరి కాబట్టి గెలిపించిన తన గ్రూపుకు మేలు చెయ్యనివాడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా ఓడిపోతాడు. It is such a simple fact.

అన్నట్టు జగన్ ఇక ప్రజానాడితోపాటు వాళ్ళ సమస్యలనూ చదవాలి. ఉన్న సమస్యలలో ఏవి ఎక్కువ ప్రజానీకాన్ని బాధిస్తున్నాయో గుర్తించగలగాలి. మండల వారీ క్యాడర్ల మీద దృష్టి పెట్టాలి. లాభ నష్టాల బేరీజు వేసుకోకుండా రాజశేఖర రెడ్డి లాగా స్నేహితులను, స్నేహితులుగానే చూడాలి.

అవండీ కోవూరు ఉపఎన్నికల ఫలితాల తర్వాత నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలు.

2 కామెంట్‌లు:

Comment Form