4, ఏప్రిల్ 2014, శుక్రవారం

విషయమేమీ లేకుండా కూడా టపా వ్రాయవచ్చు :)



ఈ మధ్య చాలారోజుల తరువాత మళ్ళీ నాబ్లాగు రమ్మని పిలిచింది. ఇంతకాలం ఏదో ఇరగదీసే పనులున్నాయనుకుంటే అది పొరపాటే. గూగుల్ ప్లస్,ఫేస్ బుక్ లకు జనాలు వలస పోయిన తరువాత బ్లాగులు రాసేవాళ్ళూ తగ్గిపోయారు కదా! పాతనీరు పోయి క్రొత్తనీరు బ్లాగుల్లో ఏమన్నా ప్రసరిస్తుందేమో కానీ నా విషయానికొస్తే వ్రాయాలన్న ఉత్సాహం తగ్గిపోవడమే. అటు ఆంధ్రదేశమంతా రాజకీయ మాయగాళ్ళతోటి అట్టుడికి పోతుంది. ఆవేడికి వసంతకాలంలోనే ఎండలు బాగా ముదిరిపోయాయని వార్తలు వస్తున్నాయి.ఆ వేడీ ఈ వేడీ కలిసి జనాలకు ఉక్కపోత మరీ ఎక్కువైందట. ఇన్ని బాధలను ఎలా భరిస్తున్నారో ఏమో చూద్దామని నేనూ ఈ ఏప్రిల్ మాసంలో తెలంగాణా/ఆంధ్ర ప్రాంతాలను దర్శించుకోవాలని బయలుదేరుతున్నాను.రెండు రాష్ట్రాలుగా విభజన జరగడానికి ఇప్పుడు ఏమీ అడ్డంకులు లేవు. తెలంగాణా ఈ నెలరోజుల్లోనే బాగా అభివృద్ధిచెంది ఉరకలేస్తుందేమో నన్న కోరిక బలంగా కూడా వుంది :-) .అసలే ఇప్పుడు మేము తెలంగాణా వాసులమయ్యేము.ఇంక ఆంధ్రప్రాంతంలో వున్నవాళ్ళంతా మాకు చుట్టాలే. వాళ్ళ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు :)

ఎలాగూ ఎలక్షన్ల టైం కాబట్టి ఎవరైనా నాక్కూడా ఫ్రీ ఆఫర్లు తలుపుతట్టి ఎమన్నా ఇస్తారేమో చూడాలి. ఒకవేళ అలాంటి ఆఫర్లతో ఫ్రీగా ఇస్తామని మీదగ్గరకు ఎవరన్నా వచ్చినా మాయింటికి కూడా పంపించండి. ఊరకే ఇస్తామంటే ఎవరన్నా వద్దంటారా ఏమిటి?

ఇకపోతే హైదరాబాదులో డ్రైవరు లేకుండా కార్లు అద్దెకిచ్చే పద్ధతి ఏమన్నా వుందా లేకపోతే కారు కావాలంటే డ్రైవరూ మనతోటి వుంటాడా?అమెరికా లో లాగా కార్లు రెంట్ కు ఇస్తే ఏంచక్కా ఆ ఊరూ ఈవూరూ తిరిగిరావచ్చు.లేదంటే ఈ ఎండల్లో బస్సుల్లో పడి తిరగాలంటే సగం జీవితం అక్కడే ఖర్చయిపోతుంది.

ఇదే విషయమేమీ లేకుండా టపా కట్టడమంటే. అక్కడనుంచి వచ్చాక మళ్ళీ బోలెడన్ని కబుర్లతో మీముందుంటాను. అంతదాకా ఎండాకాలానికి భయపడుతూ ప్రయాణానికి సన్నద్ధమౌతా...