18, నవంబర్ 2016, శుక్రవారం

బ్లాక్ టు బ్లాక్ - శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు...

 కూతురి పెళ్ళికి చేతికి అందని డబ్బు. చిన్నారి జబ్బుకు ఆసుపత్రికయ్యే డబ్బులు లేక ఒక అమ్మ విలవిల. బ్రతకడానికి నిత్యావసర సరుకులు కొనడానికీ చేతులు కట్టేసుకోవాల్సినట్లుంది.మరోవైపు వారాంతాలలో సరదగా బయటకెళ్ళి ఒక్క దమ్ము పీకుదామన్నా చిల్లరకోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కథనాలు పార్టీలకతీతంగా ప్రతి టీ.వీ ఛానల్ లో ప్రసారమవుతున్నాయి కాబట్టి ఇవి సామాన్యుని నిజమైన కష్టాలుగానే భావించవచ్చు. వీటన్నింటికి పరిష్కారం ఏమిటి? ప్రజలవద్ద, చలామణిలో వున్న డబ్బులో ఐదువందలు,వెయ్యి రూపాయలు అధికంగా వుడటం,భారతదేశంలో అంతగా వాడుకంలో లేని ప్లాస్టిక్ కరెన్సీ, నిత్యావసరాలకు అవసరమయ్యే వస్తు విక్రయమంతా డబ్బుపై ఆధారపడి జరగడమే. 
ఒకవైపు రైతు, సామాన్యుడు బ్రతకలేక చేసిన అప్పులు తీర్చలేక బ్రతుకు బండిని లాగలేక దిక్కుతెలియని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. మరోవైపు బడా వ్యాపారులు బ్యాంకులో దాచుకున్న సామాన్యుని డబ్బుతో ఇంద్రవైభోగాలనుభవిస్తూ, వారిని పాలించే పాలకునిగా మంత్రిపదవలనుభవిస్తూ   బ్యాంకులకు ఎగనామం పెట్టి  సమాజంలో దర్జాగా తిరుగుతున్నాడు. ప్రభుత్వం తలుచుకుంటే వీటిని అరికట్టడం పెద్ద సమస్యకాదుకానీ సమస్యల్లా ఆ ప్రభుత్వం మనుగడ సాగించటమే. 

ఇక మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లకుబేరులు ఎంత కష్టపడుతున్నాడో కానీ సామాన్యుడు మాత్రం తనదైనైందిన జీవితంలో అనుభవించే కష్టాలకు తోడు ఇదీ మరొకటనే స్థితికి చేరుకున్నట్లున్నాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు బ్లాక్ మనీ మార్చుకోవడానికి మరో ఉపాయంతో ముందుకొచ్చిన  వైనం ఈ క్రింది లింకు లో చదువవచ్చు



http://www.sakshi.com/news/state/black-money-converted-to-white-money-in-andhra-pradesh-423505?pfrom=home-top-story

16, నవంబర్ 2016, బుధవారం

మోడీ ఆశయం... దొడ్డిదారిలో రెండువేల రూపాయల కాగితాలు బ్లాక్ మార్కెట్ లోకి

నవంబరు ఎనిమిదవ తేదీ యధావిధిగా ఎనిమిది గంటలకు లేచి అబ్బా ఆఫీసుకు వెళ్ళాలా అనుకుంటూ తయారై ఆఫీసుకు వెళ్తూ mobile లో All India Radio  పెట్టుకొని వెళ్తూ ఆంగ్లవార్తలు వింటూ కారు నడుపుతున్నాను.ముఖ్య వార్తల్లో 1000 రూపాయలు, 500 రూపాయల ను రద్దు చేస్తున్నట్లు వినగానే రోమాలు ఒక్కసారి నిక్కబొడుచుకున్నాయి. ఈ దెబ్బతో బడాబాబులదగ్గరున్న బ్లాక్ మనీ అంతా దిబ్బలో వేసుకోవడమే నని ఆనంద పడ్డాను.భారత ఆర్థిక వ్యవస్థలో కరక్షన్ వచ్చి స్థాలాలు,ఇళ్ళ రేట్లు మిగిలిన ధరవరలు తగ్గుతాయని ఆనంద పడ్డాను.పేదప్రజల నోళ్ళు కొట్టి సంపాదించిన లంచావతారాలు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారా అని ఆలోచనతో ఆఫీసుకు చేరుకున్నాను.

సాయంకాలం ఇంటికి రాగానే వివిధ వార్తాచానళ్ళు పెట్టుకొని వార్తలు వింటూ సామాన్య ప్రజల ఇక్కట్లను చూస్తూ గడిపాను. భారతదేశాన్నుంచి వస్తూ నేను ఆరువేల రూపాయలు తెచ్చుకున్నాను. అన్నీ ఐదువందలు వెయ్యి రూపాయలనోట్లు. వాటిని ఇక్కడ మార్చుకొనే వెసలు బాటు లేదు కాబట్టి వాటిపై ఆశ వదలుకొన్నాను. ఐనా ఇంత మంచి నిర్ణయం తీసుకొన్న మోడికి మనసులో అభినందనలు తెలుపుకుంటూ ఆరోజు గడిపాను.



ఓ రెండు మూడు రోజులు గడిచిన తరువాత సామాన్యులకష్టాలు సర్దుకుంటాయని ఆశించాను.కానీ చిత్రంగా దరిదాపు పదిరోజులౌతున్నా బ్యాంకుల ముందు జనాల బారులు తగ్గటంలేదు.దీనితో పాటు బడాబాబుల దొడ్డిదారి వ్యవహారాలు చదివాను. చూస్తుంటే రాజకీయనాయకులందరూ మొదటి రెండు మూడు రోజుల్లోనే బ్యాంకు మేనజర్లతో కుమ్మక్కై రెండు వేల రూపాయల కాగితాల్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్ కు తరిలించినట్టున్నారు. ప్చ్...



ఇన్ని దొడ్డిదారి వ్యవహారాలు జరుగుతున్నా ఏదో ఒక ఆశాదీపం. కనీసం 50 శాతం బ్లాక్ మనీ ఐనా తగ్గదా అని. అక్రమాలకు పాల్పడుతున్న బ్యాంకు సిబ్బందిని, వారిద్వారా లబ్ఢిపొందిన నల్ల కుబేరులను చిత్తసుద్ధితో శిక్షిస్తారని కోరుకుంటూ....