9, అక్టోబర్ 2017, సోమవారం

నన్నయ్య కు ముందు తెలుగెలా వుండేది?

మనిషి  మనిషిగా రూపాంతరం చెందినప్పటినుండి బ్రతుకు కోసం పోరాటంలో తెగలు తెగలు గా సంచరించుచూ ఆ తెగలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటు సాటి మనిషితో సంభాషిస్తూ తన మనసులోని భావాల్ని రకరకాల శబ్దాలతో తెలియచేస్తూ సహాయాన్ని పొందుతూ సహాయపడుతూ వేల ఏళ్ళుగా సాగే పరిణామ క్రమంలో కొన్ని వేల భాషలు ఏర్పడుంటాయి. జన బాహుళ్యం నుంచి పుట్టే ఏ భాషకైనా మొట్టమొదట లిఖిత రూపముండదు.  అది జానపదమై చెప్పుకోదగ్గ పరిమాణంలో ఆ భాషను ప్రజలు మాట్లాడుతున్నప్పుడు రక రకాల అవసర రీత్యా దానికి లిఖిత రూపమివ్వబడుతుంది. దీనికి ప్రపంచంలో ఏభాషా అతీతంకాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు కూడా వందల సంవత్సరాలుగా అనేక రూపాంతరాలు చెంది లిఖిత రూపాక్షరాలు ప్రింట్ మీడియా వృద్ధిలోనికి వచ్చినాక స్థిరపడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ టపా ముఖ్యోద్దేశము తెలుగులో జరిగిన ఈ దశలను కొద్ది మాత్రంగా నైనా విశ్లేషించడమే.

తెలుగును ప్రజలు ఎప్పటినుండి ఏరూపంలో మాట్లాడేవారో చెప్పడం కష్టం. అసలు మూలద్రావిడ భాష నుండి తెలుగు రూపంగా ఎప్పుడు రూపాంతరం చెందిందో కూడా చెప్పడం కష్టం. మనకు లభిస్తున్న శాసనాలను బట్టి భట్టిప్రోలు, ఎఱ్ఱగుడి శాసనాలు తెలుగు దేశాల్లో లభిస్తున్న మొదటి శాసనాలుగా చెప్తారు. ఇది బ్రహ్మీ లిపి లో వున్న ఒక విధమైన ప్రాకృత మని చరిత్రకారులు చెప్తారు. ఇక  లభిస్తున్న తెలుగు శాసనాల ప్రకారం లిఖిత రూపంగా తెలుగు క్రీ.శ  500  ప్రాంతానికి రాజభాషల్లో కూడా చేరిందని చెప్పవచ్చు. దీనర్థము అంతకు ముందు తెలుగు కు లిపి లేదా అని కాదు. వున్నది. కానీ రాజ శాసనాల వరకూ రాలేదు.  కానీ నాటి మానవులు మాట్లాడుకొనే భాషారూపం ఎలా వుండేదో చెప్పడం కష్టం. అప్పటివరకు మనకు మనకు లభించిన శాసనాధారాల్లో అక్కడక్కడ తెలుగు పదాలు తప్పించి వాక్య రూపమైన తెలుగు లభించలేదు. వాక్యరూపమైన తెలుగు మొట్టమొదటగా ఆరవశతాబ్దిలో కడపమండలాల్లో ( కమలాపురం శాసనము )  కనిపించాయి. ఇది అప్పటివరకూ వున్న బ్రహ్మీ లిపినే కొద్ది మార్పులతో నున్న శాసనమట.

ఆనాటి శాసనాలలో తెలుగు లో అచ్చులు ఎనిమిది మాత్రమే కనిపించాయి. 

అ, ఆ, ఇ, ఈ , ఉ, ఊ , ఎ, ఒ  అనునవి మాత్రమే మొదట్లో వుండేవి. ఐ కి బదులు అయి, ఔ కు బదులు అవు అని వాడేవారు. అంటే లిఖితాక్షరాలు ఇంకా పూర్తిగా ఓ రూపు సంతరించుకోలేదు. క్రీ.శ 898 నాటికి  "ఐ" అనే అక్షరం వచ్చి చేరింది. ( అనిమల శాసనము ). "ఔ" అన్న అక్షర ప్రయోగం కనిపించలేదు.

హల్లులలో వర్గాక్షరాల అల్పప్రాణములు ( ఒత్తులు లేనివి ), అనునాశికాలు ఙ,ఞ,ణ,న,మ లు విరివిగా వాడేవారు. య,ర, ఱ, ల,వ,శ,స,హ,ళ వర్ణములు వాడుకలో వుండేవి. వలపల గిలక కూడా విస్త్రుతంగా వాడేవారు. ఇది డెభ్భై వ దశకం వరకూ కూడా వాడేవారు. కానీ ఇప్పుడు వాడుకలో కనిపించడంలేదు.

వీటితో పాటు మరో రెండు వర్ణాలు నన్నయ్యకు ముందు వాడుకలో వుండేవి. అవి 



" అడ్డు గీత లేని ఱ" అనే అక్షరాన్ని ఎలా పలికేవారో మనకు తెలియదు కానీ  సందర్భాన్ని బట్టి ఈ అక్షరం నన్నయ కాలం నాటికి కొన్ని చోట్ల "ళ" గానూ మరికొన్ని చోట్ల "ద" గాను , ఇంకొన్ని చోట్ల "డ" గానూ రూపాంతరం చెంది అదృశ్యమై పోయింది.

ఉదాహరణలు ( కంప్యూటర్ లో ఈ అడ్డగీతలేని ఱ అక్షరం లేదు కనుక ఱ నే టైపు చేస్తున్నాను. మీరు దానిని అడ్డగీతలేని ఱ అక్షరంగా ఊహించుకొని చదువుకొన మనవి. అంటే ఈ అక్షరం సందర్భాన్ని బట్టి పలికేవారేమో!

చోఱ = చోడ లేక చోళ
నోఱంబ = నోళంబ
ఱెందులూరు = దెందులూరు
క్ఱిన్ద = క్రింద
క్ఱొచె = క్రొచ్చె 
వ్ఱచె = వ్రచ్చె


ఈ పదాలను కంప్యూటర్ లో తెలుగించడం కష్టము గాబట్టి నేను చదువుతున్న పుస్తకములోని పేజీలను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకము అంతర్జాలంలో ఉచితంగా దొరుకుతుంది. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకొని చదవ వచ్చు. 

పుస్తకము పేరు : తెలుగు శాసనాలు.  1975 వ సంవత్సరంలో ప్రంపచ తెలుగు మహాసభల ప్రచురణ 
రచయిత : శ్రీ జి.పరబ్రహ్మ శాస్త్రి.













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form