28, నవంబర్ 2017, మంగళవారం

జగన్ పందొమ్మిదవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యం

ఈ రోజు పాదయాత్ర డైరీ లోని కొంత భాగం... ఆపైన నా పద్యం

"ఈ రోజు పాదయాత్రలో దారి పొడవునా ఎక్కడ చూసినా పత్తి చేలే. రైతుల ముఖాల్లో మాత్రం సంతోషం కనిపించలేదు. ఆ పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడాను. వీరిలో చాలా మంది కౌలు రైతులు. రాజు అనే రైతు ఐదెకరాలు కౌలుకి తీసుకొని పత్తి వేశాడు. ఎకరాకు దాదాపు రూ.35,000 పెట్టుబడి పెట్టాడు. గులాబీరంగు పురుగు ఆశించడంతో పంట మొత్తం నాశనమైంది. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. వచ్చిన ఆ కొద్ది పత్తిని మార్కెట్‌కి తీసుకెళ్తే, రూ.1,500 నుంచి రూ.2,000 రూపాయలకు మించి ధర పలకడం లేదు. ఈ ప్రాంతంలో పత్తి రైతులందరిదీ ఇదే వ్యథ. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేదు.

ఈ ఏడాది సబ్సిడీ మీద ఇవ్వాల్సిన లింగాకర్షక బుట్టలను కూడా ఇవ్వలేదు. కోడుమూరులో జరిగిన రైతు సమావేశంలోనూ ఇటువంటి సమస్యలే నా దృష్టికి వచ్చాయి. కేవలం పత్తే కాదు, మిగతా అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. రైతులను రుణమాఫీ చేశారా అని అడిగాను. రుణమాఫీ కాలేదు, నోటీసులు వస్తున్నాయి, చేసిన కాస్త మాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. బ్యాంకుల గడప కూడా ఎక్కలేకపోతున్నామని వాళ్లు బాధ పడ్డారు. గిట్టుబాటు ధరల విషయమై రైతుల ఆవేదన అంతా, ఇంతా కాదు. నాన్న ఉన్నప్పుడు గరిష్ట ధరలు పొందిన రైతులు ఈ రోజు గిట్టుబాటు ధరల కోసం కూడా అల్లాడుతున్నారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే రైతుల ప్రయోజనాలను దళారులకు తాకట్టు పెట్టి, రైతుల దగ్గరి నుంచి తక్కువ ధర లకు కొని, తన హెరిటేజ్‌ దుకాణాల్లో అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. వ్యవసా యం సంక్షోభంలో ఉంటేనే ఆయన కు లాభం. అందుకే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఈ పాలకుల నిర్లక్ష్యం, రైతు వ్యతిరేక విధానాలు రైతుకి వ్యవసాయాన్ని భారం చేశాయి. వ్యవసాయం దండగని భావించే పాలకులు ఉన్నంత కాలం రైతుల పరిస్థితి ఇంతే.

నాకొక స్వప్నం ఉంది. వ్యవసాయ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండటం, నిరంతర విద్యుత్, సకాలంలో వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, క్రిమిసంహారక మందులు, సాగునీటి సౌకర్యం, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు తగిన సూచనలు, సలహాలు, పంటకు గిట్టుబాటు ధర, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పంట నష్ట పరిహారం అందించడం ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేయాలి. ఒక్క ఆత్మహత్య కూడా జరగకూడదు. రైతు ముఖంలో ఆనందం, వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని రైతులు భావించాలి. రాబోయే మన ప్రజా ప్రభుత్వంలో ఈ స్వప్నం తప్పక సాకారమౌతుంది."


సీ|| దారి పొడవున ముదముజేయు పత్తిచేలాదరముగ స్వాగ తమ్ము పల్కె
కాని, పోషకుడైన కామందు మోమున గననైతి చిర్నవ్వొ క్కటియు గూడ
పంట పండించ ముప్పదియైదు వేలు విక్రయముచేయ కనరు కాసు నైన
ఎటులజీవింతు రిచటిరైతులు ప్రభుత్వ కరుణాకటాక్షంబు గనక నిచట

ఆ|| ఆదుకొందు నేను ప్రభుతనే ర్పడజేసి
మేలగు సలహాల మెప్పు తోడ
ఎన్ను కొనుడు నన్ను మీఓటు వేసి యె
లమిగ మిమ్ము ధాన్య లక్ష్మి కూడు

4 కామెంట్‌లు:

  1. మీర్రాసే పద్యాలు చదివితే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి - మీరు ఐటీలో పని చేస్తారనుకుంటున్నాను - అయినా కూడా మీరు ప్రయత్నించి ఛందోబద్ధమైన పద్యాలు రాయడం గొప్ప విషయం. చప్పట్లు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ లలితగారూ, నేను ఐ.టి వలలో చిక్కి కొట్టుమిట్టాడుతున్న సగటు జీవినే.ఇక పద్యాలంటారా, ఏదో ఉద్యోగ సంసార సరిగమలకు ఆటవిడుపు.

      మీ మెచ్చుకోలు వ్యాఖ్యకు ధన్యవాదాలు.

      తొలగించండి

  2. పత్తి చేలల చూసినాడను భారమయ్యెను గుండెయున్
    మొత్తుచుండెను రైతులెల్లను మోసమైన ప్రభుత్వమౌ
    సత్తెకాలపు రాజశేఖరు సాక్షి పల్కితి, మిమ్ములన్
    క్రొత్తతీరుల కాచెదన్ సరి ఓటులన్మరి వేయుడౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ, మత్తకోకిల చదువుతుంటే మత్తెక్కిన కోకిల కూస్తున్నట్టుంది. అసలు ఆ పద్యపు నడకే అంత. పద్యము బాగుంది.

      తొలగించండి

Comment Form