20, ఏప్రిల్ 2020, సోమవారం

జీవిత సోపానాలు -- 2

పెళ్ళి సంబంధాలు చూస్తున్నారంటే గుండె లయతప్పడం తప్పని సరి. అది అమ్మాయైనా అబ్బాయైనా!ఆ రోజుల్లో ఇప్పట్లా ఫోను సౌకర్యాలు అరచేతిలో వుండేవి కావు. ఫోను చెయ్యాలంటే ఏ ఫోను బూతు కో వెళ్ళి చెయ్యాలి.అవికూడా ఓ మోస్తరు పట్టణాలలో మాత్రమే వుండేవి.ఫోను చార్జీలు మోత మోగేవి. ఇక ఇంటర్నెట్ సంగతి సరేసరి. అదంటూ ఒకటి భవిష్యత్తును మార్చేస్తుందని ఊహకు కూడా అందని రోజులు. ఇ-మైల్ అన్న పదమొకటి ఉత్తర ప్రత్యుత్తరాలను అంతమొందిస్తుందని ఊహించలేని రోజులు.ఇక వాట్సప్, ఫేస్బుక్,ట్విట్టర్ మొదలైనవి సోదిలో కూడా లేని రోజులు. దానా దీనా చెప్పొచ్చేదేమిటంటే ఇంత సమాచార విప్లవం లేకపోవడంతో ఆరోజుల్లో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే ఓ రకమైన భయం. అందుచేత మనసుల్లో అమ్మాయిలకు అబ్బాయిలపట్ల, అలాగే అబ్బాయిలకు అమ్మాయిలపట్ల చెప్పలేని అనుభూతులను గుండె గూటిలో భద్రపరచుకొనే రోజులు.

ఇంతకీ మా ఇంటికి పెళ్ళి సంబధమై వచ్చినాయనకు ఏమి చెప్పాలో అనే సందిగ్ధం లో పడ్డాము. వస్తామని చెప్పాలా లేక రామని చెప్పాలా? ఆ యనను నిరాశ పరచడం ఇష్టం లేక సరే చూద్దాంలే అని చెప్పాము. సాయంకాలంగా ఆయన నరసరావుపేటకు తిరుగు ప్రయాణమై వెళ్ళాడు.

ఇంటిలో కొద్ది రోజులు సంతోషంగా గడచిపోయాయి.హరిహర్ ఉద్యోగం వస్తుందా లేదా అన్న మీమాంశ రోజులు  గడిచే కొద్ది ఎక్కువైంది. ఉద్యోగంలేకుండా ఇంటి పట్టునే ఎన్నాళ్ళుండాలి? ఈ ఆలోచనలతో నా సహాధ్యాయి రంగనాధ్ కు ఒక ఉత్తరం వ్రాశాను. రంగనాధ్ వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి.ఈ గ్రామం పాలకొల్లు కి ఓ ఇరవై ఇరవైఐదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది.మేము M.Tech చేసేటప్పుడు తూర్పుగోదావరి అందాలు చూడాలన్న కోరికతో రంగనాధ్ పిలుపు మేరకు ఖరగ్ పూర్ నుంచి ఇంటికి వస్తూ వాళ్ళూరుకి వెళ్ళాము. నేను, సుధాకర రెడ్డి, రంగనాధ్ ముగ్గురము రాజమండ్రిలో దిగి ఓ కారు తీసుకొని చింతలపల్లి చేరాము.అదే నేను మొదటసారి తూర్పుగోదావరి వారి ఆతిధ్యాన్ని, కోనసీమ ప్రకృతి అందాలను చూడడం. అద్బుతమైన ఙ్నాపకాలు. పచ్చని పంటపొలాలు, ఎటువైపు చూసినా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు. మధ్య మధ్యలో అరటి తోటలు, కల్మషం లేని మనసులు, ప్రత్యేకమైన యాస భాషలతో ఆకట్టుకొనే ప్రజానీకం.అక్కడ వున్న మూడురోజులూ మూడు నిమిషాలగా గడిచిపోయింది.రంగనాధ్ కుటుంబ సభ్యులు కూడా బాగా పరిచయమయ్యారు.

ఉత్తరం వ్రాసిన తరువాత ప్రత్యుత్తరానికై ఎదురుచూస్తున్నాను. ఓ మూడు వారాల తరువాత రంగనాధ్ నుంచి ఉత్తరం వచ్చింది. నేను వ్రాసిన ఉత్తరం వాళ్ళనాన్నకు చేరిందని, దానిని ఆయన పూనా లో వున్న రంగనాధ్ కు పంపాడని విషయం అర్థమైంది. ఉత్తరం చదవడం పూరైన తరువాత మరికొన్ని విషయాలు గ్రహించాను. సుధాకర రెడ్డి, రంగనాధ్ ఇద్దరూ పూనా లో ఓ షుగర్ కన్సల్టెన్సీ లో ఉద్యోగాలుచేస్తున్నారు. అప్పటికి అక్కడకు వెళ్ళి నెలనాళ్ళ పైనే ఐంది. మొదట సుధాకర రెడ్డి పూనా కు వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించిన పిమ్మట రంగనాధ్ ను రిఫర్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ ఏప్రిల్ మాసంలో పూనాకు వెళ్ళారు. ఇద్దరూ కంపెనీ కి దగ్గరలో కొత్తపేట్ లో ఓ హాష్టల్ లో వుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రంగనాధ్ వారుండే అడ్రస్ ఇస్తూ పూనాకు రమ్మని, ఇక్కడికి వస్తే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని ఉత్తరాన్ని ముగించాడు.

 ఉత్తరాన్ని చదివిన తరువాత ఇక ఇంటివద్ద  ఉండలేకపోయాను. పూనా వెళ్ళడానికి సిద్ధమైనాను. నాన్న దగ్గర కొంత డబ్బు తీసుకొని , బట్టలు, పుస్తకాలు సర్దుకొని, ఉత్తరంలో వున్న చిరునామా ని భధ్రంగా దాచుకొని ఓ శుభముహూర్తాన ఊరినుంచి పూనా కు పయనమయ్యాను.

4 కామెంట్‌లు:



  1. ---+ గుండె లయతప్పడం తప్పని సరి

    అప్పుడు లయ, ఇప్పుడు దడ తప్పని సరి :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహ్హహా....జిలేబి గారూ మీకామెంట్ చదివి ఓ ఐదునిమిషాలు పడి పడి నవ్వుకున్నాను. ఈ లయలు, దడలు జీవితంలో భాగమైపోయాయండి :)

      తొలగించండి

Comment Form