21, జులై 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యలు...


ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం పరిశీలన మొదలైంది. ప్రతిపార్లమెంట్ నియోజక వర్గాన్ని జిల్లాగా చేస్తానని ఎన్నికల ప్రచార సందర్భంగా జగన్ వాగ్దానం చేసి వున్నాడు.ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం జిల్లా కేంద్రంగా చెయ్యడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు కానీ అలా క్రొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ఏఏ ఊర్లు చేర్చాలో ఆలోచించి సమగ్రనివేదికల తరువాత మాత్రమే జిల్లాల సరిహద్దులను నిర్ణయించడం మంచిది. ఉదాహరణగా మా ఊరు వినుకొండకు దగ్గర్లోని నూజెండ్ల మండలంలో వున్న గాంధీనగరం గ్రామం. మాది గుంటూరు జిల్లా. అసెంబ్లీ నియోజకవర్గం వినుకొండ. కానీ పార్లమెంట్ నియోజకవర్గానికొచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలోని బాపట్ల. ఇప్పుడు బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పడి మా ఊరు లాంటి ఊర్లు ఎక్కడో దూరంగా వున్న బాపట్ల లో కలపడం అర్థంలేని పని. లోక్ సభ పరిధిలోని ఆ యా మండలాలను గ్రామాలను ఉన్నవి ఉన్నట్లుగా చేరిస్తే వచ్చే రాజకీయ ప్రయోజనమేమిటో నాకు తెలియదు. ఇలా చేయడంవల్ల మా ఊరు దగ్గరలోని నరసరావుపేట జిల్లాకు కాకుండా బాపట్లలో చేరడంతో ప్రజలకు చాలా అసౌకర్యంగా వుంటుంది.

 ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణం మీద ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి.అది వైసీపీ కి వ్యతిరేక పత్రికైనా ఆ కథనాల్లో నిజంలేకపోలేదు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే వార్తలు ఏవి స్వప్రయోజనంకోసం వ్రాసే వార్తలో, ఏవి ప్రభుత్వానికి లేనివి వున్నట్లుగా ఆపాదించే ఏడుపుగొట్టు వార్తలో,ఏవి క్షేత్రస్థాయి ఇబ్బందులతో కూడిన వార్తలో ఇట్టే చెప్పేయవచ్చు :)

ఇలాంటి సద్విమర్శలను అనుకూల వార్తలగా తీసుకొని నిర్ణయం తీసుకుంటే పార్టీకి ప్రభుత్వానికి మంచిపేరొస్తుంది. జగన్ పునరాలోచిస్తాడని కోరుకుంటున్నాను..

ఇలాంటి బ్లాగులో వ్రాసుకున్న వార్తలను ఒక రాష్ట్రముఖ్యమంత్రి పట్టించుకుంటాడా అన్న అనుమానాలు అక్కరలేదు. ఇది చేరవలసిన వారికి చేరి జిల్లాల ఏర్పాట్లలో సానుకూల మార్పులుంటాయని విశ్వాసంతో...

సెలవు.

2 కామెంట్‌లు:

Comment Form