8, అక్టోబర్ 2015, గురువారం

పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)

80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోన. ప్రకృతి మధ్యన వెలసిన శైవ క్షేత్రం. ఒక కొండను పూర్తిగా చెక్కి చిన్న చిన్న గుడులుగా మలచి శివాలయలుగా తీర్చి దిద్దారు. ఆ ఆలయాల్లో విగ్రహాలు కూడా విడిగా చెక్కి పెట్టినవి కావు. అన్నీ ఆ కొండలో అంతర్భాగాలే. అంటే ఏకశిలా మందిరాలు. ఇక ఊరికి కొద్ది దూరంలో కొత్తపల్లి, దర్శిగుంట పేట అనే ఊర్లు. ఏఊరికి ఆ ఊరిలో ప్రాధమిక పాఠశాల వున్నా గానీ ఉన్నత పాఠశాల మాత్రం మా ఊర్లోనే. అంటే అంబవరం లో. ఇక ఈ ఊరి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే చుట్టూ దట్టమైన అడవులు [ అప్పట్లో, ఇప్పుడు చాలా వరకు హరించుకు పోయాయి ]. ఆ అడవుల్లో బీర కాయలు, ఇవి కూర వండుకునేవి కాదు, రంగులోఎర్రగా రుచికి తియ్యగా, చిన్న విత్తనం కలిగి తిన్నప్పుడు చాలా బాగా వుంటాయి. వీటితో పాటి ఉసిరిక, నెమ్మి, ఏలక, బిక్కి కాయల లాంటివి విస్తారంగా దొరికేవి. అలాంటి ప్రకృతి మధ్యన నివసించే ప్రజలు ఆ ఊరివాళ్ళు. ఊరి పొలాల్లో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, పసుపు, ఆముదాలు, నువ్వులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండేవి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే అక్కడ అప్పటికి పట్నపు పోకడలు చాలా చాలా తక్కువ. అలాగే పైవన్నీ ఎక్కువగా దొరకడం మూలానే ఈ టపాలో మాకు పసుపు కానీ, పూజకు ఆముదం కానీ చాలా సులభంగా దొరికాయి. ఊరి రామాలయంలో హరికథా గానాలు, శివరాత్రికి రకరకాల పౌరాణిక పద్య నాటకాలు, అప్పుడప్పుడు తోలుబొమ్మలాటలు. ఇవి ఎనభైల్లో ఆ ఊరికి వినోదమందించే దృశ్య, శ్రవణ మాధ్యమాలు. ఇవన్నీ వంటబట్టించుకున్న మాలాంటి చిన్న పిల్లలకు సహజంగానే పాండవులంటే [ భారతంలో హీరోలు ] అమిత ఆరాధానాభావం. నాకు మరీ ముఖ్యంగా అర్జునుడంటే మహాయిష్టం. ఎంతగా ఇష్టం అంటే అరణ్య/అజ్ఞాత పర్వంలో అర్జునుడు బాణాలు విల్లు తీసుకొని అడవులవెంట తిరుగుతాడుకదా. ఆ సన్నివేశం ప్రతిరోజూ కొన్ని నెలలపాటుగా నాకు కలలో,
నేనే అర్జునుడుగా వెదురుతో చేసిన విల్లు తీసుకొని మా తోటలో పహారా కాసినట్టు కలలొచ్చేవి. అవునండోయ్ మా ఊర్లో వెదురు కూడా బాగానే దొరికేది. పచ్చి వెదురు బొంగును కొడవలి తో రెండుగా చీల్చి నిజంగా నా అంతటి నేనే నాలుగోతరగతిలోనే విల్లు తయారుజేయడం నేర్చుకొని గురిచూసి పిట్టల గొట్టడం నేర్చుకొన్నాను. అప్పట్లో ఇంటో నాకు పిట్టలదొర అని కూడా నామకరణం చేసేసారు :-). వాళ్ళకు నా మనసు అర్థమయి అర్జునా అని పిలిస్తే వినాలని హెంత కోరికగా వుండేదో. అబ్బే ఈ పెద్దోళ్ళున్నారే వాళ్ళకి మన పిల్లకాయల మనసు ఎప్పుడు అర్థమవ్వాలి ;-)

అలా అలా స్కూల్లో నాలుగోతరగతి వెలగబెట్టే రోజుల్లో నాకు బాబుగాడని ఒక సావసగాడు తగిలాడు. వాళ్ళయ్య హైస్కూల్ లో హెడ్మాస్టర్. వీడు మహా మాయగాడు. ప్రతిదాంతో నాకు పోటీ వచ్చేవాడు. స్కూల్లో మాకు చదువులో కాదు పోటీ... ఎవరు తెలుగు పుస్తంకంలో ఎన్ని పేజూలు చించి వేస్తారో అని :-). కాకపోతే బాపనయ్య అవడంతో వాడికి తెలివి మస్తుగా వుండేది. పోటీ మొదలౌద్దా, ముందుగా వాడు వాడిపుస్తకంలో ఒక పేజీ సగం చింపేపాడు. మరి పోటీలో మనం ఓడిపోకూడదు కదా, అందుకని నేను నా పుస్తకంలో మొత్తం పేజీ చింపేసేవాడిని. అలా ఓరోజు ఓ అశుభ ముహూర్తంలో మొదలైన చింపటం అనే కార్యక్రమ ఫలితం ఓ పదినిమిషాల్లో నాచేతిలో తెలుగు పుస్తకం అట్ట దప్ప ఏమీ మిగల్లేదు. అంతే కాదు వాడు పేజీలను ఏంచక్కగా ఒక క్రమ పద్దతిలో చించాడు. అంటే మళ్ళీ బంక పెట్టి అతికించినా లేదా సూదితో కుట్టుకున్నా పనికొచ్చేటట్టు. మరి నేనో :-) ఏదో సినిమాలో బ్రహ్మానందం పేపరు చింపడం గుర్తు తెచ్చుకోండి :-)

చింపేటప్పుడు మహా ఆనందంగా వున్నది కానీ తరగతి గదిలోకి అయ్యవారు వచ్చి వీపు చీరగానే నేనాలపించిన గీతం మాత్రం నాకు కర్ణకఠోరంగా ప్రక్కనున్న సావాసగళ్ళకు మహా పసందుగా వినిపించింది :-). అంతటితో ఆగిందా నేను మా ఇంటికెళ్ళడానికంటే ముందే ఈ వార్త ఇంట్లో తెలిసింది. నాకంటే ముందు నా సావాసగాళ్ళందరూ ఇంటిముందు గుమిగూడి ఎప్పుడెప్పుడు సంగీతం విందామా అని ఏనుగు చెవులేసుకొని గుంటనక్కల్లా కాచుకోనున్నారు. మరి ఎన్నైనా అయ్యవారు పరాయి వాడుకాబట్టి కొద్దిగా నాలుగు దెబ్బలతో సరిపెట్టాడు కానీ , ఇంట్లో వాళ్ళు సొంత మనుషులు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ముట్టచెప్పారు. దానికి ప్రతిఫలంగా నా శాయశక్తులా నేనూ తిరిగి రాగాలాపన చేసాను :-)

ఇలాంటిది ఒకటేమిటి చెప్పుకుంటా పోతే ఒక రసవత్తరమైన బాల చిత్రం అవుతుంది. అలాంటి సెట్టింగే మరొకటి. అప్పట్లో మాకు కావాల్సిన ఆటవస్తువులను మేమే చేసుకొనేవాళ్ళం. అంటే కారు, బస్సు, రైలు ఇలాంటివి కావాలంటే ఖాళీ అగ్గిపెట్టెలను ఆ ఆకారంలో మార్చుకొని వాటికి మందుసీసాల రబ్బరు మూతలను చక్రాలుగా అమర్చి మాకు కావాల్సిన వాహనాన్ని చేసుకొనేవాళ్ళం. నిజంగా ఎంత తృప్తిగా వుండేదో. ఈ బాబుగాడున్నాడే వాడు నా బాల్య జీవితంలో ఒక విలన్ లాంటోడు. వాళ్ళ నాయన హైస్కూల్ హెడ్మాస్టరే కాదు . R.M.P. వైద్యుడు కూడా. కాబట్టి వాళ్ళింట్లో ఎప్పుడూ ఖాళీ మందు సీసాలకు కొదవుండేది కాదు. ఓరోజు ఇద్దరమూ కలిసి రైలు తయారు చేసుకుందామని గుసగుసలాడుకొని ప్రణాళికా రచనలో పడ్డాము. నేనెలాగు రబ్బరు మూతలు తేలేను కనుక వాడు చెప్పిన ప్రపోజల్ కు సరే అన్నాను. అంటే వాడు రబ్బరు గాన్లు తెచ్చేటట్టు, నేనేమో అవసరమైన అగ్గిపెట్టెలు తెచ్చేటట్టు. ఆ విధంగా పనులు విభజించుకొన్నాక వాడలా ఇంటికెళ్ళి ఓ ఇరవై మంది సీసాలు బుడక్కిన తీసుకొచ్చాడు. మరి నాకు అగ్గిపెట్టెలు ఇప్పుడు కనీసం ఒక ఇరవై కావాలి. అక్కడా ఇక్కడా అడుక్కోని ఒక ఐదో ఆరో సంపాయించాను. ఇక మిగిలినవాటికోసం ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. అదుగో అప్పుడు నాలోని మరో మనిషి నిద్రలేచి ఓ సలహా ఇచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న డజను నిండు అగ్గిపెట్టెలు మాయం. పుల్లలు తీసి ఇంటివెనకాల సందులో పారబోసి రైలు పెట్టెలు తయారు చేసి వాడొకరోజు, నేనొక రోజు హాయిగా ఆడుకొంటూ స్వర్గలోకాల్లో విహరించే ఒకానొక రోజు.....

ఇంట్లో వాళ్ళకి కొత్త అగ్గిపెట్టె అవసరం పడి చూస్తే ... ఇంకెక్కడి అగ్గిపెట్టెలు... కట్ చేస్తే షరా మామూలే.. ఇంట్లో సినిమా... ఇంటిబయట ప్రేక్షకులు :-)

అలా ఆ అమాయకత్వం అంతటితో ఆగిందా..అబ్బే ఆరోతరగతికి వచ్చేటప్పటికి బాలల పురాణ పుస్తకాలు చదవడంతో అందులో హీరోలు ఎవరైతే వారుగా మమ్మల్ని ఊహించుకోవడం బాగా తలకెక్కేసింది. ఊర్లో అంతకుముందు కొన్ని రోజులక్రితమే శ్రీరామనవమికి లవకుశ నాటకమేసారు. అప్పుడు మొదటిసారిగా "రామనీల మేఘశ్యామా..కోదండరామా" అనే పాట విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇంకేముంది అప్పటినుండి రాముని అవతారంగా పరకాయప్రవేశం చేసేసాను. అదుగో అప్పుడూ ఈ బాబుగాడు నాకు పోటీనే..రేయ్ నీకంటే నేను పెద్దోడ్ని నేనే రాముణ్ణి , నువ్వు లక్ష్మణుడివని. కానీ ఈసారి కుదరదంటే కుదరదని వాడ్ని లక్షణుడిగా సెటిల్ చేసేసి నేనే రాముడి నయ్యాను. ఇంతవరకూ బాగానే వుంది. మరి సీత?

అక్కడన్నమాట మా హీరోయిన్ రంగ ప్రవేశం. ఊర్లో అంతా సూర్యవంశ రాజులు, గొల్లవారు ఎక్కువ. కాబట్టి బడికి అమ్మాయిలను పెద్దగా పంపేవారు కాదు. మరి వచ్చిన వాళ్ళల్లో కొద్దిగా మాకు నచ్చిన పిల్ల నాగేశ్వరి [ పేరు మార్చాను ]. ఆ పిల్లకు కాస్త చింతపండు,జీలకర్ర కలిపి ముద్దగా చేసి ఓ చీపురు పుల్లకు గ్రుచ్చి లంచంగా ఇచ్చి మచ్చిక చేసుకున్నాము. ఇంతకీ ఇదేమి బాగుంటుందనుకొనేరు. కొత్త చింతపండు, జిలకర,ఉప్పు కలిపి ముద్దచేసి తిని చూడండి. సూపర్ గా వుంటుంది. ఇలా నాగేశ్వరిని సీతగా మార్చేసాము. నేను రాముడిని కదా..కొంచెం నీలి రంగులో వుండాలికదా. అందుకని ప్రతిరోజు స్కూల్ కి వచ్చేటప్పుడు మొఖానికి అరచేతి నిండా పాండ్స్ పౌడరు దట్టంగా దట్టించి స్కూల్ కి వచ్చేవాడిని. బాబుగాడు, నాగేశ్వరీ కూడా వచ్చాక ముగ్గురం కలిసి ఒక బావి దగ్గర చేరేవాళ్ళం. ఎందుకంటే అంతకుముందే అప్పటికే అక్కడ ఇటుకలతో ఒక చిన్న గుడిని, ఒక దీపకుందీని, ఆముదపు డబ్బాని తయారుగా పెట్టుకొని వున్నాము.

పెళ్ళి పత్రికల్లో ఆరోజుల్లో కచ్చితంగా రాముడు సీత ఇద్దర్నీ ప్రింట్ చేసేవాళ్ళు. అలాంటి పెళ్ళి పత్రికను ఒకటి మేము ఇటుకలతో కట్టిన ఆ గుడిలో పెట్టి దేవునిగా చేసి దీపారాధన చేసి, ఎవరూ చూడకుండా దానికి ఒక పెద్ద అట్టముక్కను వాకిలిగా పెట్టి మళ్ళీ స్కూల్ కి చేరుకొనేవాళ్ళం. ఒంటేలు గంట కొట్టగానే ముగ్గరం కలిసి మళ్ళీ మా గుడి దగ్గరకు పోయి పూజ చేసేవాళ్ళం. మరి అప్పటికి రాముడి మేకప్ పోయుంటుందికదా! సీత మేకప్ వేస్తుంటే హాయిగా వేపించుకొనేవాడిని. లక్ష్మణుడు మేము దీపారాధన చెసేటప్పుడు చుట్టుప్రక్కల జనసంచారమైతే మాకు సమాచారం ఇవ్వడానికి కాపలాగా వుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాకా ఈ ఆట బాబుగాడికి మహా బోర్ కొట్టేసింది. ఎందుకంటే వాడెంత సేపున్నా దీపారాధన చెయ్యలేడు,పౌడరు పూపించుకోలేడు :-). సరే అని వేరే ఆట ఆడాలని ముగ్గురం డిసైడ్ అయ్యాం. ఈసారి మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరం మా ఆటకు మూల వస్తువు.

ఇంతకీ ఆటఏమిటంటే ఒక ఐదుమందిమి కలిసి ద్రౌపతి ని పెళ్ళి చేసుకోవడం. కానీ ఇక్కడ మాకొక చిక్కు వచ్చింది. మేము ముగ్గరం ఇప్పటికే ఎవరికీ తెలియకుండా రామ,లక్ష్మణ, సీత అవతారాలెత్తాము. ఇప్పుడు మరో ముగ్గురు అంటే ఎక్కడ గొడవలౌతాయో అని భయం కూడా వేసింది. అందుకని మేమిద్దరమే పాండవులం. నాగేశ్వరి ద్రౌపతి అన్నమాట. ఇక పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించేసుకున్నాం. ఇంతకీ పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ మా ముగ్గురికీ ఒకటే భయం. పెళ్ళయితే పిల్లలు పుడతారాని :-)


కానీ పెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఒకసారి వచ్చాక ఇక మనసూరుకుంటుందా? హబ్బే రాత్రులు నిద్రపట్టేది కాదు. ఎలా? ఎలా? ఎలా?... ఏదైతే అది అవుతుందని ముగ్గురం ధైర్యం చేసాము. మా స్కూలు వెనకాల ఒక పెద్ద ఇసుక గ్రౌండ్ వుండేది. ఇప్పటికీ వుంది కానీ ఇసుక మాత్రం చాలా తక్కువగా వుంది. ఒక రోజు, అపర సంధ్యవేళ, చుట్టు ప్రక్కల ఆడుకొనే పిల్లలు అందరూ ఇంటికెళ్ళాక ఎవరూ లేని సమయం చూసి ముగ్గురం సమావేశమయ్యాము. పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుడతారనే భయం ఒకప్రక్క తొలుస్తూనే వున్నా మిగతా కార్యాచరణకు మంతనాలు సాగించాం. ఈ సారి నా వంతు తాళిబొట్టు తయారు చేయడం. బాబుగాడి వంతు పసుపు త్రాడు సంపాయించడం. అప్పటికి మాకు పెళ్ళిలో బెల్లం జీలకర్ర నెత్తిన పెడతారని తెలియదు. తాళి కట్టేస్తే ఇక పెళ్ళయిపోయి పిల్లలు పుట్టేస్తారని మాత్రమే తెలుసు :-)

ఇలా ముచ్చటించుకోని మంచి ముహూర్తం కోసం నేను, బాబుగాడు ఊర్లో రామాలయంలో హరికథలు చెప్తున్న హరిదాసు గారిని కలిసి, " మేము బాగా చదవుకోవాలనుకుంటున్నాము ఏరోజు మొదలు పెడితే ఫస్టు మార్కులు వస్తాయో " చెప్పమని కోరాము. ఇక్కడ మరో విషయం ఈ హరికథా దాసు గారితో మాకు అప్పటికే కొంచెం చనువు ఎక్కువ. వారి పేరు గుర్తు లేదుకానీ వారు చెప్పే రుక్మిణీ కల్యాణం హరికథకు రోజూ వెళ్ళి ముందు వరుసలో కూర్చొని గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని శ్రద్ధగా వినేవాళ్ళం. అలాగే మాకు నచ్చిన పద్యాలను ఆయనచేత ఒక తెల్లకాగితం మీద వ్రాయించుకొని ఊరు బయటుండే పెద్ద రావిచెట్టు మీదెక్కి వచ్చేదాకా రాగాలు తీసేవాళ్ళం :-)

ఈ చనువుతో పాపం ఆయన నిజమేననుకొని ఒక మంచిరోజు చెప్పారు :-). ఇక నేను తాళి ఎలా సంపాయించాలి? బంగారం అంటే దొంగతనం చేయ్యాలి కదా ! హబ్బే అప్పటికి ఎదో ఇంట్లో అగ్గిపెట్టెలు తప్ప ఇలా విలువైనవి కాజేసేటంత సీనులేదు. అదీకాక మనం ఏపని చేసినా ఎలా కనిపెట్టేస్తారో గానీ ఇంట్లో వెంటనే తెలిసిపోయేది. అప్పుడే డిసైడ్ అయిపొయ్యా..నేను పెద్దాయ్యాక నా పిల్లోల్లకు ఏది అడిగితే అది కొనిచ్చేయాలని :-)

అద్దో అలా చించి చించి, ఒక చిల్లపెంకు తో తాళి తయారు చెయ్యడానికి నిర్ణయించుకొన్నాను. ఒక మోస్తారు చిల్లపెంకు సంపాయించి. ముందుగా ఒక చీలతో దానికి అతి జాగ్రత్తగా రెండు రంధ్రాలు పెట్టి చుట్టూ బాగా అరగదిద్ది గుండ్రంగా తయారు చేసి ఒక కాగితంలో చుట్టి ఇక పెళ్ళిరోజుకోసం వైటింగ్....

ఆ రోజు రానే వచ్చింది. బాబుగాడు ఇంట్లో ఒక దారపు వుండ కాజేసి , ఒక పొట్లంలో దంపుడు పసుపు తెచ్చాడు. వాడికి అప్పటికి దారాన్ని తొడల మీద పెట్టి ఎలా నెయ్యాలో రాదు. కాబట్టి ఆ పనీ నేనే చేసి ఆ దారానికి "చిల్లపెంకు తాళి బొట్టు" దూర్చి సిద్ధం చేసాము. ఇంతకుముందు మేము రాముడికి గుడికట్టిన బావి దగ్గర నుంచి కొద్దిగా నీళ్ళుతెచ్చి "పసుపు" ఆ నీళ్ళలో వేసి పేనిన దారానికి దట్టంగా పసుపు పట్టించాము. అలా మేము ఈ పనులన్నీ చేసుకొని గ్రౌండ్ చేరేటప్పటికి మా ద్రౌపతి మాకోసం ఎదురు చూస్తూ వుంది.:-)

అంతా బాగానే వుంది కానీ మళ్ళీ మాకొక సమస్య :-) ముందు ఎవరు ఈ చిల్లపెంకు తాళిని కట్టాలని.. చూసి చూసి మా ద్రౌపతి నేనుపోతానని బెదిరించింది. ఇలా లాభం లేదనుకోని ఇద్దరం ఒకేసారి మెళ్ళో వేసేసాము.

వెయ్యడమైతే వేసాం కానీ ఇంక అప్పుడు చూడాలి మా పరిస్థితి. గుండెల్లో ఒకటే దడ. పిల్లో పిల్లోడు పుడితే ఓరిదేవుడా :-౦ ... ఆ భయానికి ముగ్గరం మూడు ప్రక్కలకు ఒకటే పరుగు. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రెండో రోజు స్కూల్ కి భయం భయంగా వెళ్ళాను. బాబు గాడు ఆబ్సెంట్. ఆ పిల్ల మాత్రం ఏమీ ఎరుగనట్టు చూస్తుంది. నాకు ఒకటే దడ. కాసేపాగి కడుపు వైపు చూడండం, హమ్మయ్య అనుకోవడం.:-) ఆ రోజునుండి ద్రౌపతి తో మాట్లాడాలంటే భయం. ఆ పిల్ల కడుపుమీద చెయ్యేసుకుంటే భయం. అబ్బా మా బాధలు ఒకటని ఏంచెప్పేదిలే. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే బాబు గాడి నాన్నకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి నన్నొంటరిని చేసేసాడు.

అప్పుడు తట్టింది నాకొక ఐడియా! నేను కూడా మా బాబాయికి ఇలాగే ట్రాన్స్ఫర్ అవ్వాలని ఒక్కడినే మేము ముగ్గురము కట్టిన గుడికి వెళ్ళి దీపారాధన చేసి దండం పెట్టుకోని వచ్చాను. మరి ఆ రాముడికి ఏమి అర్థమయిందో ఏమో కానీ ఒక నెలలోపే ట్రాన్స్ఫర్ రావడం మా సొంత ఊరికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. వెళ్ళానే కానీ మళ్ళీ పిల్లో పిల్లోడో పుట్టాక ద్రౌపతి అమ్మా నాన్నవాళ్ళు వచ్చి ఎక్కడ మాయింట్లో చెప్తారో అని భయం వెన్నాడుతూనే వుందేది. కానీ ఏడో తరగతిలో నాగభూషణం గాడు "ఆ టైపు" పుస్తకం నాచేత చదివించినా కూడా పిల్లలు ఎలా పుడతారో తెలియనేలేదు. :-). పదవ తరగతి సామాన్య శాస్త్రం లో పునరుత్పత్తి వ్యవస్థ చదివాక హమ్మయ్య అని గాలి పీల్చుకోగలిగాను :-)

అదండీ పెళ్ళి పిల్లలు, తాళి సినిమా... ఓ నాలుగు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు భైరవకోన చూడాలని అదే పనిగా వెళ్ళి వస్తూ అంబవరంలో ఆగి స్కూల్ ఫోటోస్ ను, ఆ గ్రౌండ్ ను, మేము గుడి కట్టిన బావిని తనివితీరా చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చాను. కానీ నాగేశ్వరి ఎక్కడవుందో తెలియలేదు. అలాగే బాబుగాడు కూడా ఇప్పటిదాకా మళ్ళీ తారస పడలేదు. :(

7, అక్టోబర్ 2015, బుధవారం

మా ఊరి వార్త - కొన్ని జ్ఞాపకాలు

మా ఊరి వార్త మంచిదో చెడ్డదో  రెండు పేపర్లలో కనిపించేటప్పటికి నాకు ఎక్కడలేని ఆనందమేసింది :-). నేను ఎప్పటినుంచో మా ఊరి పేరు ఒక్కసారన్నా పత్రికల్లో వస్తే చూడాలని కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందెప్పుడన్నా వచ్చేయామో నాకు తెలియదు కానీ, నేను అసెంబ్లీ నియోజకవర్గ పేపర్లు చదవడం మొదలు పెట్టిన తరువాత మా ఊరి పేరు వార్తాపత్రికల్లో ఒక వార్తగా  చూడడం ఇదే ప్రధమం. సెప్టంబరు 28,2015 నాడు సాక్షి, ఈ నాడు లోని వార్త యిది. ఈనాడులో ఊరి పేరుని తప్పుగా జిల్లెలపాడు అని వ్రాశారు.కానీ మా ఊరి పేరు జెల్లెళ్ళపాడు.ఆంధ్రజ్యోతి కి వెలిగండ్ల మండలానికి విలేకరి లేనట్లున్నాడు కాబట్టి మా మండల వార్తలు ఆంధ్రజ్యోతిలో  బహు అరుదుగా కనిపిస్తాయి.

ఈనాడు వార్త



సాక్షి వార్త




రెండు ఊర్లగా ఉండే పాతూరు,కొత్తూరు లను కలిపి జిల్లెళ్ళపాడు అని పిలుస్తారు. పాతూరు కు కొత్తూరు కు మధ్యలో కొంత పొలమడ్డు. రెండు ఊర్లలో కలిపి దరిదాపు ఓ నూటాయాభై ఇళ్ళుండేవి. మాల,మాదిగ కాలనీలను కూడా కలుపుకుంటే ఓ రెండొందలపాతిక ఇళ్ళుండేవి. జిల్లెళ్ళపాడు మండలకేంద్రమైన వెలిగండ్ల కు 2.5 కి.మీ దూరంలో వుంటుంది. ఊరికి బస్సు సౌకర్యం లేదు. కరెంటు వున్నా కానీ తొంభై శాతం ఇండ్లకు కరెంటు సౌకర్యం లేదు.కిరోసిన్ బుడ్లనే వుపయోగించేవాళ్ళు. కిరోసిన్,బియ్యము,చక్కెర ఊరికి రెండుకిలోమీటర్ల దూరంలో నున్న గోకులం  రేషన్ షాపునుంచి తెచ్చుకొనే వాళ్ళము. మంచినీళ్ళూ కావాలంటే ఊరికి ఆనుకొని ప్రవహించే వాగు ఒడ్డున చెలములు తీసుకొని ఆ చెలముల్లో ఊరిన నీటిని తోడుకొని తీసుకొని వచ్చేవాళ్ళం. ఊర్లో ప్రాధమిక పాఠశాల మేడం నాగిరెడ్డి వాళ్ళింట్లో వరండా లో వుండేది. తరువాత 1980 దశకం చివర్లో ప్రాధమిక పాఠశాల కు విడిగా ఒక గది కల్గిన బడిని కట్టించారు. పిల్లలు ఐదవతరగతి వరకు ఇక్కడ చదివి ఆరునుండి పది వరకు చదవడానికి మధ్యాహ్న భోజన కేరియర్ లు తీసుకొని మండలకేంద్రమైన వెలిగండ్లకు నడిచి వెళ్ళేవారు. నా విద్యాభ్యాసం ఐదవతరగతి వరకు మా చిన్నాయన వాళ్ళ దగ్గర గడిచినా ఆరునుండి పది వరకు వెలిగండ్లలోనే జరిగింది.వెలిగండ్ల హైస్కూల్ లో చదువులు అంతంత మాత్రమే వుండేవి.చదువుకొనే పిల్లలలో ఎక్కువ శాతం వ్యవసాయ దారుల, వ్యవసాయ కూలీల పిల్లలే. హైస్కూల్లో ఆరవతరగతి నుండి పదవ తరగతి వరకు నేను చదివిన రోజుల్లో ఓ 180-200 మధ్య వుండేవారు.స్కూలు కు ఆరేడు కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడిచి వచ్చేవాళ్ళు.బడిలో చెప్పిన పాఠాలే తప్ప హోమ్ వర్క్ లతోటి విసిగింపూ వుండేది కాదు.బడినుంచి ఇంటికి నడిచి వెళ్తూ దారిలో వున్న పొలాల్లో దోసకాయలు,అలసందలు మొదలైనవి తింటూ సంక్రాతి నెల వచ్చిందంటే చెలకలలోని రేగి పండ్లు తింటూ హాయిగా ఇల్లుచేరేవాళ్ళము. నేను పదో తరగతిలో వున్నప్పుడు మా ఊరి బడి పిల్లలకు నేనే నాయకుణ్ణి.అంటే వాళ్ళు తినడానికి పొలాల్లో కోసుకున్న ప్రతి దాంట్లో నాకు భాగమియ్యాలన్న మాట :-)

పల్లెటూళ్ళు కాబట్టి వైద్య సౌకర్యాలుండేవి కావు. మండల కేంద్రమైన వెలిగండ్ల లో కూడా ఒక RMP డాక్టరు మాత్రమే వుండేవాడు.ఆ డాక్టరు అసలు పేరేమిటో తెలియదుకానీ అందరూ పిచ్చి డాక్టరనేవారు. నా చిన్నప్పుడు కండ్లకలకతోటి నాకన్నులు మూసుకొని పోతే ఆ డాక్టరే నయం చేశాడు.తరువాత కొద్ది రోజులకు పిచ్చి డాక్టరుకూడా ఊరు విడిచి వెళ్ళిపోయారు.అప్పుడు జనాలకు దిక్కు తాలూకా కేంద్రమైన కనిగిరి నే.ఐనా అదేమి కాలమో కానీ అలా వాగులోనుంచి తెచ్చుకున్న నీరు తాగినా అంత త్వరగా జబ్బున పడేవాళ్ళము కాదు.

ఇక నా చదువు విషయానికొస్తే మొట్టమొదటి సారిగా ఏడవతరగతి త్రైమాసిక పరీక్షలలో తెలుగు పరీక్షకు కాపీ పెట్టాను.అదికూడా తిరుమల-తిరుపతి అనే పాఠ్యానికనుకుంటా. దీనికి ప్రేరణ నా సీనియర్స్, పదవతరగతి చదువుతున్న మా ఊరి విద్యార్థులు. వాళ్ళను చూసి చెడ్డీ కి క్రిందభాగంలో అంచుగా కుట్టిన కుట్లు విప్పి మరీ కాపీదాచాను. ఆ ప్రశ్న పరీక్షలో రాలేదు కానీ నాకు చాలా భయమేసింది.ఒకవేళ పట్టుకుంటే స్కూల్లో పరువేమైపోతుందని. ఆ తరువాత మళ్ళీ హైస్కూల్లో ఎప్పుడూ కాపీ పెట్టలేదు. ఏడవతరగతిలో మాకు సోషల్, లెక్కలకు సుబ్బారావు అనే అయ్యవారు వచ్చేవారు. చదువు పెద్దగా చెప్పకపోయినా క్లాస్ రూమ్ లో హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు బాగా పాడేవాడు. ఆ రకంగా ఆయన గుర్తువున్నాడు. ఇంగ్లీషుకు మస్తాన్ అయ్యవారు ,హిందీ కి సరళాబాయి  టీచరు వచ్చేవారు. తెలుగు, సైన్స్ ఎవరు చెప్పారో ఏమిచెప్పారో కూడా సరిగా గుర్తు లేదు. 

ఏడవ తరగతినుండి ఎనిమిదవ తరగతికి వచ్చినప్పుడు చలమారెడ్డి అని లెక్కల టీచర్ ను ట్రాన్స్ఫర్ చేస్తే 8,9,10 తరగతి పిల్లలమందరమూ పంచాయితీ ఆఫీసు వరకు టీచర్ ను ట్రాన్స్ఫర్ చెయ్యవద్దని స్లోగన్స్ తో వెళ్ళి వచ్చాము. 9,10 తరగతి పిల్లలకు ఆయన లెక్కలు బాగా చెప్తాడని పేరుండేది. కానీ ఆయన ట్రాన్స్ఫరైపోయిన ఒక్క నెలలోపే చిన్నకోటయ్య అనే లెక్కల అయ్యవారు వెలిగండ్లకొచ్చారు.ఈ టీచర్ ఆయనకంటే బాగా చెప్పేవాడు.దానితో నాకు లెక్కలపై ఆసక్తి పెరిగింది. 8,9,10 తరగతులలో తెలుగు కు మా చిన్నాయన మెడం సుబ్బారెడ్డి, హిందీ కి సరళాబాయి,సైన్స్ కు ఆవులనారాయణ రెడ్డి, ఇంగ్లీష్,సోషల్ కు రవీంద్రనాథ్,లెక్కలకు చిన్నకోటయ్య అయ్యవార్లు చెప్పేవారు. నేను తొమ్మిదిలో వుండగా హిందీ టీచర్ సరళాబాయి ట్రాన్స్ఫరై వెళ్ళిపోవడంతో పిడుగు పాపిరెడ్డి టీచర్ వచ్చాడు. ఈయన ఆమె కంటే బాగా చెప్పేవాడు. పదవతరగతి ఇంగ్లీషు చెప్పడానికి  మా హెడ్మాష్టర్ గాలిరెడ్డి గారొచ్చేవారు. 

వెలిగండ్లలో శాఖాగ్రంధాలయముండేది. ఇప్పుడు పని చేస్తుందో లేదో తెలియదు కానీ, ఆరోజుల్లో ప్రతిరోజు తీసి వుంచేవాళ్ళు. నా సహాధ్యాయి చిలకల నాగిరెడ్డి ఎనిమిదవతరగతిలో వుండగా  గ్రంధాలయానికి వెళ్ళి శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం పుస్తకం తీసుకొని వచ్చాడు.వాడి దగ్గర ఆ పుస్తకం తీసుకొని సగం చదవగానే నా పుస్తకం నాకిమ్మని లాక్కున్నాడు. బోడి నువ్వేందోయ్ నాకిచ్చేదని నేను లైబ్రరీకెళ్ళి అక్కడి లైబ్రేరియన్ ను పుస్తకాలు ఇంటికి తీసుకొని వెళ్ళి చదువుకుంటానంటే ఓ చూపు చూసి ఇక్కడే కూర్చొని చదువుకో అని చెప్పేసింది. వారంలో ఒక రోజు అలా వెళ్ళి ఓ పదినిమిషాలు కూర్చుని చదువుకొని వస్తుండేవాడిని. కానీ మాయదారి బుద్ధి ఊరుకోదుకదా. ఓ రోజు ఎలాగైనా ఒక పుస్తకాన్ని ఇంటికి తీసుకొని పోయి చదవాలని నిర్ణయించుకొన్నాను. అడిగితే ఇవ్వలేదు. సరే ఇలాగుందా నీపనని ఆ పుస్తకాన్ని చల్లగా లైబ్రేరియన్ చూడకుండా నా పుస్తకాల సంచిలో సర్దేసి కాసేపు వేరే ఏదో పుస్తకాన్ని తీసుకొని చదివినట్లు నటించి బయటకు వస్తుంటే నా సంచీ చూడాలని ఆపింది :-). ఇంకే ముంది దొంగ దొరికి పొయ్యాడు :). ఆనాటినుంచి నేను మళ్ళీ వెలిగండ్ల లైబ్రరీ గడప తొక్కితే ఒట్టు :-). 

మా ఊరిపేరు వార్తాపత్రికల్లో చూడగానే గతమంతా రీళ్ళు రీళ్ళు మదిలో మెదిలింది. పుట్టి పెరిగిన ఊరిని 1990 లో వదిలేసి వచ్చేశాము. చివరి సారిగా 2008 లో ఆ ఊరికి వెళ్ళి వచ్చాను. మరికొన్ని విశేషాలు మరొకసారి.

1, అక్టోబర్ 2015, గురువారం

రాయలకాలం నాటి ప్రజల రసికతా జీవనము

మొన్న digital library of india (http://www.dli.ernet.in/)  లో అలా పుస్తకాల కోసం సంచరిస్తుంటే రాయలనాటి రసికతా జీవనము కనిపించింది. ఈ పుస్తకం చూడటంతోనే ఆనాటి ప్రజల సాంఘిక జీవనము గురించి ఏమైనా వ్రాశారేమోనని చదవడం మొదలు పెట్టాను.ఈ పుస్తకాన్ని సరస్వతీ పుత్ర శ్రీ  పుట్టపర్తి గారు రచించారు.మొదటి ముద్రణ 1955 లో రెండవముద్రణ 1957 లో వెలువడింది. రాయలనాటి కాలంలో రచించిన ఆముక్తమాల్యద,కాళహస్తీశ్వర మహాత్యము,మనుచరిత్ర,పాండురంగ మహాత్యము,కళాపూర్ణోదయము మొదలైన పుస్తకాలలోని పద్యాలను ఆధారంగా చేసుకొని ఆనాటి ప్రజల రసికతా జీవనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. 

ఇక పుస్తకం చదవడం నాకు కొంచెం కష్టమైంది. ఎన్నెన్నో తెలియని పదాలు ప్రతి పుటలో కనిపించాయి.వాటికి అర్థాలను తెలుగునిఘంటువులో( http://telugunighantuvu.org) శోధించుకుంటూ పుస్తకాన్ని చదవడం పూర్తిచేశాను. ఈ పుస్తకం చదివిన తరువాత ఆముక్తమాల్యద ను కూడా చదవాలని కోరిక కలగడంతో ప్రతిపదార్థ సహిత ఆముక్తమాల్యద పుస్తకాన్ని digital library of india లో వెతికి నా కంప్యూటర్ లో కి దించుకొన్నాను కూడా.

ఇక పుస్తకపాఠం లోనికి వెళ్తే ఆనెగొంది కాపేరెలా వచ్చిందో దానిచుట్టూ వున్న కోటల వర్ణనలతో  మొదలౌతుంది. ఊరికి తూర్పున "దరోజి" ఉత్తరమున "తోరణగల్లు" వాకిళ్ళు. రాజులు జైత్రయాత్రకుపోయి జయశ్రీ మదదిగ్ధులై తిరిగి వచ్చేటప్పుడు తోరణగల్లు దగ్గర విజయతోరణములు కట్టుట వాడుక. విజయనగరంలో కావలివారికి తెలియకుండా ఈగైనా లోనికి రాదు. ఆనాటి శిక్షలు కూడా కఠినమే. గుఱ్ఱములు కోట లోనికి రాకుండా విద్యానగరపు ఏడవకోటకవతల "పంగలరాళ్ళ" ను పాతివుంచారు.అవి సర్పములవలె మెలికలు మెలికలు వుండి మనిషిమాత్రమే లోనికి రావడానికి అవకాశముండేది.  రాచనగరికి దగ్గరిది ఏడవకోట, దూరముది ఒకటవకోటని అర్థం చేసుకోవాలి. అంటే రాచనగరిలోనికి గుఱ్ఱములకు ప్రవేశం లేదు.

పట్టణంలోనికి ప్రవేశించగానే చెఱుకు తోటలు, ఆకు తోటలు,ద్రాక్షతోటలు,గొజ్జంగి వనములు, నారికేళ చెట్లు మొదలైనవి వుండేవని ఊహ. ఈ ఉద్యానవనములు దాటిన పిమ్మట తుంగభద్రానది నీటితో సశ్యశ్యామలమైన వరిచేలు.ఈ ప్రకృతిలక్ష్మి ఒకటవకోటనుండి మూడవ ప్రాకారము వరకు వుండెడిదట.మూడవకోటనుండి ముచ్చటైన ఇండ్లు.ఆ గృహములు విశాలములై ఉన్నతమైనవి.సున్నపు కాంతులతో మెరుస్తూ ఇండ్లపైన కలశములు నిలిపేవారు. వీటిమధ్యకూడా అక్కడక్కడ గుడిసెలు,మట్టిమిద్దెలుండెడివి.

ఏడవకోటలో రాచనగరలు,వారి ఉద్యోగుల గృహములు. రాచనగరమునుండి ముదటికోటకు గలదూరము ఎనిమిది మైళ్ళు.విద్యానగరమునందలి పేటలు విశాలమై నలభై అడుగుల వెడల్పుండెడివట.దారికిరువైపుల చల్లని నీడనిచ్చు చెట్లు తుంగభద్ర నీరు.ప్రతిపేట మొదట్లో చివర్లో హిందూ ముస్లిం సంప్రదాయాల ననుసరించిన కమానులుండేవి.

రాయల బలగాన్ని గూర్చి చెప్తూ పన్నెండువేల దాసీలుండేవారని పేర్కొంటారు. అంతఃపురములో రాణులకు కావలసిన సొమ్ములు చేయించే కంసాలులు రెండువేలు.రాజుకు వంట చేయటానికి రెండువందలమంది. ఆనాడు విద్యానగరం లో ప్రజలు ముప్పై లక్షలకు మించి వుండేవారని ఊహ.ఎప్పుడూ ఇరవైవేల పల్లకీలు,వాటిని కాచుకొని రెండులక్షల బోయీలూ వుండేవారు.ఇక విద్యానగరానికి వర్తకమునకై ప్రతిరోజూ వచ్చి వెళ్ళే బండ్లు రెండువేలు.ఇవి చెల్లించెడి సుంకమే లెక్కలేనంత. వచ్చిన ధనమును కొండగుహల్లో భూగృహములు కట్టి దాచేవారని ప్రతీతి. విజయనగరములో శైవ,వైష్ణవ గుడులు నాలుగువేలు.ఉభయ సంధ్యలందచట దేవదాసీల నృత్యం. విద్యానగరములో ఇల్లు ఎలా వుండేవో కూడా వసుచరిత్ర పద్యాన్ని ఆధారంగా చేసుకొని వర్ణిస్తారు.సాయంకాలమందు వీధులలో పుష్పలావికల చతుర సంభాషణాన్ని ఆముక్త మాల్యద పద్యాధారంగా వర్ణిస్తారు.

తుంగభద్రానది వారికొక దైవదత్తము.ఈ నది గూర్చి వర్ణనలూ ఆముక్త మాల్యద నుండి ఉటంకించారు.అక్కడి జనులు పండుగ పబ్బాలందు ఆ నదిలో స్నానము చేస్తే వారి కఠిన స్థనములకు పూసిన కస్తూరి,జవ్వాది పూతల ఘుమఘుమలు ఆ నీళ్ళలో కలిసి ప్రవహించెడివట.
ఆనాడు ఇంటి ఆవరణలలోనే తోటలు దిగుడుబావులుండెడివట.అప్పటి స్త్రీలు స్నానం కోసం దిగుడుబావుల మెట్లక్రింద పసుపు ముద్దలను దాచెడి వారట.రాత్రులు అక్కడ నిద్రించిన హంసల రెక్కలకు ఆ పసుపు అంటుకొని అవి ఆకాశంలో ఎగురుతుంటే ఆ రెక్కలు బంగారు వర్ణ రెక్కలుగా కనిపించేవట. అంటే ఆ రోజుల్లో పసుపు స్నానాదులందు అంత విరివిగా ఉపయోగించెడు వారేమో. తలంటు స్నానాలగురించి చెప్తూ వున్నవారు తలకు గంధామలకంబు పెట్టుకొంటే లేనివారు చమురంటుకొని తలస్నానము చేయుదురట. ఊరిలో దేవరను చూసుటకు వెళ్ళు వారు జలకమాడి కాటుక, సిందూరము,పూలు పెట్టుకొని వెళ్ళేవారట. ఇప్పుడు పసుపు రుద్దుకోవడం,కాటుక దిద్దడం చాలావరకు పోయినట్లే. ఇక బొట్టు,ఫూలు ఎంతకాలముంటాయో.

ఆనాడు జీవించినది సుఖస్వప్నమువంటి ఒక రసికజాతి.జీవితమును వారు ప్రేమించునట్లు ప్రేమించుటకు మనకు సాధ్యముగాని పని.ప్రవృత్తి నివృత్తులందు సంపూర్ణ స్వాతంత్ర్యంవారిది.చతుర్విధ పురుషార్థములలో( ధర్మార్థ కామ మోక్షములు) దేనిని కూడా వారు అనవసరమని త్రోసి వేయలేదు.ధర్మార్థ మోక్షములను సాధించుటకెంత పట్టుదలో జీవితావసరమైన కామాన్ని సాధించటానికి వారి అభిలాష అంతే. 

ఆనాడు తమ ఏలుబడిలో నున్న ఊర్లపేర్లను కూడా సుందరంగా మార్చిరట.ఉదయగిరి పేరు మణినాగపురి గా,పెనుగొండ ను ఘనగిరి,సురగిరి యని బేలూరు వేలాపురి గా పిలిచేవారట.అలాగే నాటి రాజులు కట్టించిన భవనములకు కూడా మలయకూటము,గగనమహాలు,రత్నకూటము మొదలైన అందమైన పేర్లతో పిలిచెడి వారట.

ఇక నాటి స్త్రీ,పురుషులిరువురు పూలనిన అమిత ఆసక్తిని కనబడిచెడి వారట. తాంబూల సేవనము అమితంగా ఇష్టపడేవారట.ఏదైనా బహుమానము యిచ్చేటప్పుడు కూడా ఈ తాంబూలము తప్పని సరి. రాజులిచ్చెడి మర్యాదలలో కర్పూర తాంబూలము లేని బంగారు ఆభరణాలపైన కూడా నాటి వారికి మనసు వుండెడిదికాదట. ఈ ఆచారము మనకు ఇప్పటికి  కనిపిస్తూనే వుంటుంది,

నాటి ఋతువుల గూర్చి ముచ్చటిస్తూ వసంతకాలమొచ్చినదట.శిశిరంలో మానిన ముత్యాల పేరులను తిరిగి వేసుకుంటారట.అలాగే మంచాల క్రింద పెట్టుకొనే కుంపట్లను తీసివేసేవారట. వసంతంలో  ఇప్పలు  పూస్తాయట.ఈ ఇప్పలంటే యేమి చెట్టు పూలో మరి.ఆ పూలమీదనుంచి వీచే గాలులతో వనమంతా మత్తెక్కిపోతుందట.ఆ మత్తుకు కామినులు రవికలను సడలించి క్రిక్కిరిసిన గుబ్బలతో ప్రాణవల్లభులను హత్తుకొనిదెరట.మధుపానములతో ప్రొద్దే తెలియదట.ఈ కాలంలో ఆడవారు వీణలపై హిందోళ,వసంత రాగములను పాడెదరట. వసంతరాగం గూర్చి చెప్తూ నాటికాలంలో వసంతరాగం సంపూర్ణరాగమేమో అని కూడా చెప్తారు.

ఎండాకాలంలో గ్రామాల్లో చలి పందిళ్ళు వేసేవారట.ఆ చలిపందిళ్ళలో ( నేటి చలివేంద్రాలవలె ) వనితలు మల్లె పూలు పెట్టుకొని బాటసారులకు నీరుపోసే వారట.నాటి చలి పందిళ్ళలో మగవారు వుండేవారు కాదు.చలిపందిళ్ళలో బాటసారులకు ప్రపాలిక( చలివేంద్రము లో నీరు పోసెడి ఆడ మనిషి)  ల మధ్య సరసాన్ని కూడా వర్ణిస్తారు. వేడి తగ్గడానికి గంధపు పూత పూసుకొనెడి వారట.వేసవిలో వంటల గురించి చెప్తూ అన్నము,బెల్లం చారు,పల్చని పులుసులు,చెఱుకు రసం,కొబ్బరి నీళ్ళు,తీపి భక్ష్యములు,పండ్లు,వాసనగల చల్లని నీరు,వేసివి వడను పోగొట్టడానికి ఊరవేసిన మామిడి పిందెలు,నీళ్ళు ఎక్కువగా కలిపిన మజ్జిగ మ్కొదలైనవి వాడేవారట.

ఇంతలో వర్షాకాలమొచ్చేస్తుంది.కడిమి చిగురించును.మొగలిపూలు వికసిస్తాయి.ఏనుగులు భూమిని మూచూస్తాయి. కాపులు అంబలి మోసుకొని పొలములలో కాపలా వున్న భర్తలదగ్గరకు వెళ్ళెదరు.పొలాల్లో వర్షానికి  రక్షణగా  గుడిసెలు వేసేవారు. వర్షాకాలంలో రెడ్లు ఆకుకూరలు చింతచిగురుతో కలిపి నూనెతో వేయించి ఆవిర్లు క్రక్కుతుండగా ఆరుగబియ్యపు టన్నాన్ని తిని గొడ్డూ గోదా పొలాలకు తోలి కుంపటి పెట్టుకొని చావళ్ళలో దూడలు తమ శరీరాన్ని నాకుతూ వుండగా నిద్రపోతారు.

ఇలాగే శరదృతువు గూర్చి కూడా వర్ణిస్తారు.

వారిజీవన విధానం గూర్చి చెప్తూ చక్కని రసికత కంటే కొంత లాలసత ఎక్కువైనట్లభిప్రాయపడతూ నాటి జనులు స్త్రీలను భోగ్యవస్తువులుగనే చూశారని అభిప్రాయ పడతారు.వారు హైందవమహమ్మదీయ నాగరికత అల్లిబిల్లిగా పెనవేసుకొన్న కాలమందు జీవించుటచే ఈ లాలసగుణము కొంత అంటుకొన్నదని కూడా అభిప్రాయపడతారు.ఇది ఆనాటి ప్రజలకే కాకుండా కావ్య నాయకా నాయికలకూ వర్తిస్తుందని మనుచరిత్రనుదహరిస్తారు. నాటి అంతఃపుర స్త్రీలలో ప్రేమపై పోటీలుండెడివట.రాజులప్రేమను చూరగొనలేని భార్యలు విషపానము గూడా చేసేవారు.స్త్రీ,పురుషులిరువురూ పరస్పర వశీకరణకై మంత్ర తంత్రములతోపాటు మందూ మాకులను వాడేవారు.ఇన్ని దురాచారములన్ననూ శ్రృంగార విషయములో స్త్రీలకే పట్టాభిషేకం.

 సంగీతాన్ని గూర్చి వివరిస్తూ అళియరాముడు తల్లికోట యుద్ధానికి ప్రయాణమైనప్పుడు అతని వెంట వెళ్ళిన బలగాలతోపాటి 4876 మంది విద్వాంసులు,5687 మంది కవులు, 569 ఖడ్డీతాళాలవారు,479 మంది కేవలము తాళగాండ్రు వున్నారట.బండారం లక్ష్మీనారాయణ,లొల్ల లక్ష్మీధరుడు నాటి ప్రసిద్ధ సంగీత శాస్త్రకర్తలని చెప్తారు.

ఈ పుస్తకము చదవడానికి నాకు మామూలు పుస్తకముకంటే పదిరెట్ల సమయం ఎక్కువగానే పట్టింది. ఆనాటి సాంఘిక జీవనవిధానానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేనప్పుడు ఇలా ప్రబంధాలలోని పద్యాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి ఒక పుస్తకాన్ని రచియించడం ఎంతైనా మెచ్చుకోదగ్గది. కానీ నాటి సామాన్య మానవుని జీవితం ఎలా వుండేదో తెలుసుకోలేకపోతున్నామే నన్న లోపం ఈ పుస్తకం చదివిన తరువాత కూడా వెంటాడుతుంది.

ఆసక్తి కలవారు ఈ పుస్తకాన్ని PDF రూపంలో ఇక్కడనుంచి Download చేసుకోవచ్చు రాయలనాటి రసికతా జీవనము