10, డిసెంబర్ 2017, ఆదివారం

మహాభారతం ఆదిపర్వము - ప్రధమాశ్వాసము - నా కల్పనలు - 1

చాలా సంవత్సరాలక్రితం హైదరాబాదు వెళ్ళినప్పుడు కోఠి లోని విశాలాంధ్ర బుక్ హౌస్ కు వెళ్ళినప్పుడు తిరుమలతిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన మహాభారత పుస్తకాల కట్ట అన్ని వాల్యూములు నా కంటబడ్డాయి.అవి ప్రతిపదార్థ వ్యాఖ్యాన సహితమై ఈరోజే కొనేసెయ్ అని నన్ను టెంప్ట్ చేశాయి :). కానీ వాటి బరువు అప్పటికే నేను తీసుకెళ్ళవలసిన లగేజీ తలచుకొని వీటినెలా తీసుకొనిపోవాలనే ఆలోచనతో వాటిని కొనడం అప్పటికి వాయిదా వేశాను. ఆ తరువాత కొన్నేండ్లు దాని గురించి మరిచిపోయాను.

మళ్ళీ ఒకటి,రెండు సంవత్సరాలక్రితం దేనికోసమో వెదుకొతుంటే టి.టి.డి వారి వెబ్సైట్ నాకంట పడటం అందులో ఉచితంగా భారత బాగవత పుస్తకాలుండడం చూసి ఆలసించిన ఆశాభంగమని భారతము, భాగవత పుస్తకాలను నా కంప్యూటర్ లోకి దిగుమతి చేసుకున్నాను. ఆపుస్తకాలు నాకంటికి కనిపిస్తూ చదవనిదానికీపుస్తకాలు నీకెందుకన్నట్టు కన్నుగీటుతుండేవి.

పోయిన నెల ఇరవైనాల్గవతేదీ ( నవంబరు ఇరవైనాలుగు ) నుంచి వీలున్నప్పుడు ఆంధ్ర మహాభారతం చదువుదామని నిర్ణయించుకొని చదవడం మొదలుపెడితే నేటికి ఆదిపర్వంలోని ప్రధమాశ్వాసము పూర్తయింది.నేను చదివిన దాన్ని క్లుప్తంగా వ్రాద్దామని ఈ టపా.

నన్నయ్య భారతాన్ని ఒక సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టాడు. "శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు..."  అని భారతం మొదలు పెట్టాడు. భారతం మొదట  విష్ణువు,శివుడు, బ్రహ్మలు రాజరాజనరేంద్రునికి శ్రేయస్సు చేకూర్చాలని మొదలు పెడతాడు. ఆ తరువాత రాజులకు ప్రీతికరమైన ముఖ స్తుతి మొదలౌతుంది. అతని పరాక్రమాన్ని,అందచందాలను, వంశాన్ని ఇతోధికంగా పొగిడేపద్యాలున్నాయి. ఐతే ఈ పద్యాలలో మనకు కొంత చరిత్ర తెలిసే అవకాశమున్నది.

రాజరాజనరేండ్రుడి తండ్రిపేరు విమలాదితుడని తెలుస్తుంది.వీరిది చాళుక్య వంశమనీ తెలుస్తుంది.రాజరాజనరేంద్రుడు ఆగమశాస్త్రాలు తెలిసినవాడని తెలుస్తుంది.ఆ కాలంలో రాజు విధి వర్ణాశ్రమ ధర్మాలు పాటింపచేయడమే నని నమ్మడం విశేషం. బ్రాహ్మణులు సమాజంలో అగ్రగణ్యులుగా వుంటూ రాజుల ప్రాపకంతో దానధర్మాలు స్వీకరిస్తూ సుఖమయజీవనం గడిపేవారనుకుంటాను. బ్రాహ్మణులకు దానం చేయడం పుణ్యమనే నమ్మకం లోకంలో బలంగా వుండేదనుకుంటాను. దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు లోటులేకుండా చూసుకోవడంకూడా రాజు లక్షణం అని తెలుస్తుంది.

నాడు రాజసభల్లో వ్యాకరణ పండితులూ, పురాణ ప్రవచనాలు చెప్పేవారూ, కవులు, తర్కశాస్త్రము క్షుణ్ణంగా తెలిసినవారూ వుండేవారని తెలుస్తుంది. అంటే అక్షర జ్ఞానమున్న వారికి గౌరవమర్యాదలెప్పటినుంచో వున్నాయని తలంచవచ్చు. అలాగే కులవృత్తులు వంశపారంపర్యమని, కొన్ని పదవులు తండ్రి తరువాత తనయునికి దక్కుతాయని కూడా తెలుస్తుంది. నన్నయ్య రాజరాజనరేంద్రునికి ఈ విధంగా కులబ్రాహ్మణుడయ్యాడు. రాజరాజనరేంద్రుడు శివభక్తుడని తెలుస్తుంది.

తరువాత భారతాన్ని వినడం వలన కలిగే ఫలాలు చెప్పబడినాయి. ఆ కాలంలో విద్య శ్రవణ ప్రధానం కాబట్టి "వినడం" వలన అని వాడి వుంటారు. ఇక్కడ కూడా బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్యమని చెప్పడంద్వారా నాకొకటి అనిపిస్తుంది. ఆకాలంలో మిగిలిన కులాల వారందరూ స్వయంపోషకులు అనుకుంటాను. అంటే వ్యవసాయమో లేదా తదనుకూలమైన వృత్తో చేయడంవలన వారి పోషణ వారు చూసుకొనేవారనుకుంటాను. కానీ బ్రాహ్మణుల వృత్తి పురాణాలను,వంశ గత చరిత్రలు, యజ్ఞ యాగాదులు, మంత్ర తంత్రాలను,చరిత్రను పరిరక్షించడం మొదలైన వృత్తి కాబట్టి వీరికి ఎవరైనా ఏదైనా పెడితే గానీ కుటుంబం గడవని పరిస్థితి కాబట్టి బ్రాహ్మణులకు దానాలు చేయడం పుణ్యమని పురాణాలద్వారా సామాన్యప్రజల మనస్సులలో చొప్పించి వుంటారు.

మొత్తానికి భారతాన్ని వ్రాయమని రాజరాజనరేంద్రుడు నన్నయను కోరడం నన్నయ్య దానికొప్పుకొని తాను భారతాన్ని యెలా రచించదలచుకున్నాడో చెప్పుకొని భారత కథను  నైమిశారణ్యంలో  శౌనకుడనే కులపతి సత్త్రమనే యాగం చేస్తూ వుండగా ఊగ్రశ్రవనుడునే కథకుడు( రోమహర్షుని కుమారుడు)  అక్కడకు వచ్చి మునుల కోరికమేరకు భారతం చెప్పడం మొదలుపెట్టాడని భారతకథనెత్తుకుంటాడు. సంస్కృతభారతంలో వున్న పర్వాలను తెలుగులో ఏఏ పర్వవములో వ్రాయనున్నాడో ఆ పర్వాలలో వున్న శ్లోకాలసంఖ్యను మొదలైన వాటిని విషయసూచికలలాగా వివరిస్తూ భారతయుద్ధం శమంతపంచకమనే ప్రదేశంలో జరిగిందని చెప్తాడు. వింటున్న మునులూ శమంతపంచకము కాపేరు ఎలా వచ్చిందని, అక్షౌహిణి అంటే పరిమాణంలో ఎంత చెప్పమని అడుగుతారు.

త్రేతా ద్వాపరయుగాల మధ్యకాలంలో పరుశురాముడు యుద్ధప్రీతి పరుడై శత్రురాజులనందరిని చంపి ఆ రక్తంతో ఐదు మడుగుల నింపి పితృదేవతలకు తర్పణమిచ్చాడు. అలా ఆ ప్రదేశానికి దగ్గరలోనున్న స్థలం శమంతపంచకమని పిలుస్తున్నారని చెప్పి అక్షౌహిణి అంటే ఏమిటో యిలా చెప్పాడు.

ఒకరథం+ఒక ఏనుగు+మూడు గుర్రాలు+ఐదుగురు కాలిబంట్లు = పత్తి
పత్తికి మూడురెట్లు=సేనాముఖం
సేనాముఖానికి మూడురెట్లు = గుల్మం
గుల్మానికి మూడురెట్లు = గణం
గణానికి మూడురెట్లు = వాహిని
వాహినికి మూడురెట్లు = పృతన
పృతనకు మూడురెట్లు = చమువు
చమువుకు మూడురెట్లు = అనీకిని
అనీకినికి పదిరెట్లు = అక్షౌహిణి

ఒక్కొక్క దానిలో ఎన్ని ఏనుగులు ఎన్ని గుర్రాలు ఎన్ని రథాలు ఎంతమంది కాల్బలమో మీరే లెక్క వేసుకోండి.
మొత్తంగా చూస్తే 21870 రథాలు, 21870 ఏనుగులు,65610 గుర్రాలు, 109350 కాల్బలం కలిపి ఒక అక్షౌహిణి. ఇటువంటివి ఏడక్షౌహిణులు పాండవుల పక్షాన, పదకొండక్షౌహిణులు కౌరవపక్షాన తలపడ్డాయి.

శమంతపంచకమనే ప్రదేశంలో కురుపాండవుల యుద్ధం జరగడంచేత ఆప్రదేశానికి కురుక్షేత్రం అనికూడా పేరొచ్చింది.

యజ్ఞయాగాదులు రాజులయొక్క కర్తవ్యమనుకుంటాను. భారత యుద్ధానంతరం జనమేజయుడు దీర్ఘకాలం యజ్ఞాన్ని చేశాడు.అక్కడకు దేవతల కుక్కయైన సరమ కొడుకు సారమేయుడు ఆడుకొనడానికి వస్తాడు.దాన్ని జనమేజయ తమ్ముళ్ళు శ్రుతసేనుడు,భీమసేనుడు,ఉగ్రసేనుడు అనే వాళ్ళు కొడతారు.ఆ కుక్క ఏడుస్తూ వెళ్ళి తనతల్లికి చెప్తుంది. సరమ వచ్చి జనమేజయుడిని కడిగిపారేస్తుంది. అన్యాయంగా నా కొడుకుని కొట్టావు నీకు ఆపదలొస్తాయని చెప్పి అదృశ్యమైపోతుంది.

జనమేజయునికి సరమగిలి పట్టుకోని దాన్ని శాంతింపచేయటానికొక పురోహితుని వెతుకుతూ అడవులు పట్టుకు పోయి ఆ అడవుల్లో శ్రుతశ్రవసుడనే మునిని చూస్తాడు.ఈ శ్రుతశ్రవసునికి సోమశ్రవసుడని ఒక కొడుకు. ఆ సోమశ్రవసుని పురోహితునిగా పంపమని కోరుతాడు.ఆ సోమశ్రవసుని మంచి మాటలతో శాంతిపొంది రాజ్యాన్ని సుఖంగా అనుభవిస్తూ వుండగా

జనమేజయుడు రాజ్యంలోనే ఒకానొక అరణ్యంలో పైలుడు పాఠాలు చెప్పుకుంటు జీవిస్తుంటాడు.పైలుని గురుకులంలో ఉదంకుడనేవాడు విద్యనభ్యసిస్తుంటాడు.ఇతను గురువుకు ప్రియ శిష్యుడై ఎనిమిది సిద్ధులను సంపాదిస్తాడు. ఉదంకుడు గురువుగారి భార్య చెప్పటంతో పౌష్యుడనే రాజు భార్యయొక్క కుండలాలు తీసుకురావడానికి బయలు దేరుతాడు. దారిలో తనకొక మహానుభావుడుకనపడి ఎద్దుపేడ తినమంటే తిని పౌష్యుని దగ్గరకెళ్ళి వచ్చిన పని చెప్తాడు. రాజు దానికి సంతోషపడి రాణి దగ్గరకెళ్ళి తెచ్చుకోమంటాడు. ఉదంకుడంతఃపురానికెళితే రాణి కనిపించదు. ఏడుపుమొఖంతో రాజుదగ్గరికొచ్చి రాణి కనపడలేదంటే నువ్వు అపవిత్రుడవు కాబట్టి కనపడలేదంటాడు. అప్పుడు ఎద్దుపేడతిన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ అన్నీ కడుక్కొని రాణిదగ్గరకెళ్ళి కుండలాలు తీసుకొని రాజువద్దకొచ్చి వెళతానంటాడు. పౌష్యుడు అన్నంతిని పొమ్మంటాడు.అన్నంలో వెంట్రుకొచ్చిందని ఈ సద్బ్రాహ్మణుడు రాజును గుడ్డివాడివి కమ్మని శపిస్తాడు. రాజు మాత్రం తక్కువ తిన్నాడా..నీకు పిల్లలు లేకపోవుగాకని శపిస్తాడు.

ఈ శాపనార్థాలను చూస్తే నాకొకటనిపిస్తుంది. ఆ కాలంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఏదైనా నోటితో అంటే అది జరుగుతుందనే నమ్మకం ప్రబలంగా ప్రజల మనసుల్లో నెలకొని వుండాలి. ఒక్కొక్కచో విధి వశాన ఏమైనా కీడు జరిగితే అది తప్పకుండా శాపం వల్లే జరిగిందని భయపడేవారనుకుంటాను. ఇన్ని యజ్ఞాలు మనిషిని శాంతితో సంతోషంతో జీవించడానికి ఏర్పరచుకున్నట్టి వైనా కోపతాపాలు ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళలో పరిపూర్ణంగా వుండేవని దెబ్బకు దెబ్బ తీయాలని వుండే మానవ సహజ ప్రవృత్తి ఎక్కడికీ పోలేదని భారతంలో వచ్చే అనేక కథలద్వారా మనకు కనిపిస్తుంది.

ఉదంకుడు కుండలాలు తీసుకొని వస్తూ వుంటే  ఒక సెలయేరు కనిపిస్తే ఈ కుండలాలొడ్డున పెట్టి ఆచమనానికి దిగుతాడు. తక్షకుడనే పాము అదే అదనుగా చూసుకొని ఆ కుండలాలను దొంగలించుకొని నాగలోకానికి వెళతాడు. ఉదంకుడు కూడా సిద్ధులు తెలిసిన మూలంగా పుట్టలో దూరి నాగలోకానికి వెళతాడు. ఇక్కడ నన్నయ్య పాములను స్తుతించే పద్యాలు అద్భుతం.ఇక్కడ ఉదంకునికి తెల్లని నల్లని దారాలతో నేతనేస్తున్న ఒక స్త్రీ, పన్నెండాకుల చక్రాన్ని తిప్పుతూ ఆరుగురు యువకులు, గుర్రాన్నెక్కి వున్న ఒక దివ్యపురుషుని చూస్తాడు. దివ్యపురుషుడు అనుజ్ఞతో గుర్రము చెవిలో ఊదితే పాతాళమంతా ప్రళయకాల బడబాగ్ని జ్వాలలు వ్యాపిస్తాయి.అవి తట్టుకోలేక తక్షకుడు కుండలాలు తెచ్చి ఇస్తే దివ్యపురుషుడు తనగుర్రానెక్కి మీ గురవాశ్రమానికెళ్ళమంటాడు. ఉదంకుడు గురువు దగ్గరకొచ్చి జరిగిన విషయం చెప్పి తనకు పాతాళంలో కనిపించిన వాటికి అర్థాలడుగుతాడు. తెలుపు నలుపు పగలు రాత్రికి సంకేతాలని, దానిని నేస్తున్నవారు ధాత విధాత అని, పన్నెండాకుల చక్రం నెలలరూపమైన సంవత్సరమని,దానిని తిప్పేవాళ్ళు ఋతువులని ఆ దివ్యపురుషుడు ఇంద్రుని మిత్రుడైన వర్జన్యుడని చెప్తాడు. అలాగే నీకు ఎద్దుపేడ తినిపించిన పురుషుడు ఇంద్రుడని ఆ యెద్దు ఐరావతమని చెప్తాడు.

ఇక్కడ నాకొకటనిపిస్తుంది. గురువులు శిష్యులదగ్గర చులకనకాకుండా తనకు తోచినది జరిగిన సంఘటనలకు అన్వయించి ఏదో ఒకటి చెప్పి సంతృప్తి పరిచేవారనుకుంటాను.



సశేషం

13 కామెంట్‌లు:


  1. మరో మాడరేట్ "రంగనాయకయ్య" ఆవిర్భావం అయ్యేటట్టున్నది పంచదశలోక కథా విశ్లేషణ చూస్తోంటే‌:)


    జెకె:)

    ఆల్ ది బెస్ట్

    పారలల్ గా వ్యాసులవారి సంస్కృత భారతాన్ని పెట్టుకుని చదివితే ఇంకొంచెం కథా పఠనం
    బావుంటుందనుకుంటా :)

    BTW, have you thought about the significance of nbr 21870 ?


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ మళ్ళీ పుల్లపెట్టారా :). నాకు ఏ కులం మీద ద్వేషభావము లేదు. వుండదు. నాకనిపించిన భావాలను ఇక్కడ ఇలా చల్లుతున్నాను. అంతే :)
      వ్యాసభారతం ఆన్లైన్ లో ఎక్కడైనా దొరుకుతుందా? దొరికితే లింకు ఇవ్వగలరా?
      ఇప్పుడు 21870 నెంబరు గురించి రీసెర్చ్ చెయ్యడానికి సంఖ్యా శాస్త్రము నేనెక్కడ నేర్చుకోనండి :)

      తొలగించండి

    2. You can find them in archive.org
      Sample for udyoga larva

      https://archive.org/stream/srivedavyasavira024006mbp#page/n17/mode/1up

      తొలగించండి
    3. ఒక అక్షౌహిణి= 21870 రథాలు + 21870 ఏనుగులు + 65610 (3*21870) గుఱ్ఱాలు + 109350 (5*21870) కాల్బలం

      Zilebi garu: I just got interested in 21870 when you asked for its significance and I see a relationship in the number of chariots, elephants, horses & infantry (1:1:3:5). I am just curious to know if there is any other significance for 21870.

      తొలగించండి
    4. And that 1:1:3:5 ratio corresponds to the definition of Patti:

      ఒకరథం+ఒక ఏనుగు+మూడు గుర్రాలు+ఐదుగురు కాలిబంట్లు = పత్తి

      తొలగించండి
  2. Lalitha garu, I believe Zilebi is referring the sum of that number (18) and the association with the number of days the war occurred (18). Surprisingly the army combined in both sides is 18 (11+7).

    If there is any other significance to 21870 number, I would also like to hear from Zilebi.

    రిప్లయితొలగించండి


  3. Both of you have found rightly.

    My guess I think it represents closely PI;( when you divide it by 7000 )

    Another way when you divide by 9 power 4 you get recurring 3.333


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. why should one need to divide with 7000. I mean, what is its significance?

    రిప్లయితొలగించండి

  5. సప్తాస్యాసన్ పరిధయః....


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీటిని కూడా కందాల్లో చెబితే జనం చచ్చుండేవాళ్ళు.
      జేకే:-)

      తొలగించండి


    2. వృత్తపు చుట్టుకొలతకున్
      వృత్తపు వైశాల్యమునకు బృందారముగన్
      చిత్తపు కైపు జిలేబియు
      కొత్తగ యనుబంధము కనుగొనె హరి బాబూ :)

      జిలేబి :)

      తొలగించండి
  6. ఏమిటి జిలేబి గారూ, చక్రాన్ని మళ్ళా కనిపెట్టే ప్రయత్నమేదన్నా చేస్తున్నారా మీరు? ☺

    రిప్లయితొలగించండి

Comment Form