23, జనవరి 2013, బుధవారం

బ్రతుకు రహదారి ( 8 lane high way )



౧) బయట భోరున వర్షం.ఉరుములు మెరుపులతో సాయంత్రం నాలుగు గంటల సమయమైనా చీకట్లు అలుముకున్నాయి.

౨) వీధి చివర పురాతనమైన శైవాలయం. వీధి మలుపులో నుండి ఓ ఏభైఏళ్ళ పెద్దాయన పంచెకట్టుతో తడుచుకుంటూ తన పదేళ్ళ మనుమడిని తీసుకొని శివాలయం వైపు నడుస్తుంటాడు.

౩) "తాతా పరిగెత్తు"

౪) మనుమడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆలయ ప్రాంగణంలో నున్న పెద్ద జమ్మి చెట్టు క్రింద నిలబడతాడు.

౫) వేగంగా నడుస్తూ తాతకూడా జమ్మిచెట్టు క్రిందకు చేరి  "ఇక్కడేదో గుడి వున్నట్లుంది లోపలికి పోదాంరా" అంటూ ఇద్దరూ కలిసి ఆలయ ద్వారం గుండా లోపలికి అడుగు పెడతారు.

౬) కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు.  శివాలయ ప్రాంగణంలో అప్పుడే గాలికి రాలిన ఆకులు, చెట్ల కొమ్మలు. గర్భగుడికి ఈశాన్య మూలగా చిన్న మండపం. వాళ్ళిద్దరూ అలా ఆ పరిశరాలను గమనిస్తుండగానే ఇందాకటి మెరుపు తాలూకూ ఉరుము వినిపిస్తుంది. పిల్లఆడు భయపడి తాత నడుము తన రెండు చేతులతో బంధించి గట్టిగా పట్టుకుంటాడు. మరో మెరుపుతో పరిశరాలను తాత ఆకళింపు చేసుకుంటాడు

౭) పిల్లవాడు కాసేపటికి తాత చిటికెన వేలు పట్టుకొని భయంభయంగా నడుస్తుంటాడు. ఉన్నట్లుండి మెరిసిన మెరుపుకు గర్భగుడిలో నున్న శివలింగం మూడవకన్ను తెరుచుకున్నట్లు కనిపిస్తుంది.

౮) ఆ చీకటిలోనే గంట మ్రోగిన శబ్దం. కాసేపు నిశ్శబ్దం. ఆ తరువాత చెట్ల ఆకులపై మనుషుల అడుగుల శబ్దం. ఎక్కడనుండో ఓ పక్షి అరుపు. వెనువెంటనే ఓ ఉరుము.

౯) తడిసిన బట్టల నీళ్ళు పిండి మండపంలో నేలపై ఆరవేసుకుంటారు. ఈదురుగాలుల దెబ్బకు వానజల్లు మండపంలో అన్ని వైపుల నుంచి ఈడ్చికొడుతుంది.


౧౦) వెంట తెచ్చుకున్న గోనె సంచిని తడువకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంటాడు.

౧౧) కాసేపటికి వర్షం తగ్గుముఖం పడుతుంది. గాలులు తగ్గుతాయి.

౧౨) ఓ మూలన దుప్పటి కప్పుకొని తాత ఒడిలో పడుకొని వున్న మనుమడు ఎటో చూస్తూ మధ్య మధ్యలో తాత కళ్ళలోకి అప్పుడప్పుడూ సూటిగా చూస్తూ వుంటాడు. రెండు గంటల సమయం గడిచి పోతుంది. నిద్రపోతున్న మనుమడిని ఓ ప్రక్కగా పండబెట్టి గోనెసంచిలో నుంచి మరొక్క దుప్పటి తీసి క్రింద పరచి మనుమడిని దానిపై సర్ది తానూ మనుమడికి ఓ ప్రక్కగా పడుకొని ఆకాశం వైపు చూస్తూ వుంటాడు.

౧౩) ఆకాశం నిర్మలమై కార్తీక పౌర్ణమి వెలుగులను ప్రసరిస్తుంటుంది. ఈ వెలుగుల్లో ఆలయప్రాంగణం నిర్మలమై శోభాయమానంగా కనిపిస్తుంటుంది.

౧౪) ఒక చిరుమబ్బు చంద్రబింబాన్ని ఒక లిప్తమాత్రం కప్పి వేస్తుంది. ఆలయప్రాంగణంలో చీకటి వెలుగులు స్పష్టంగా తెలుస్తుంటాయి. ఆ సుందర దృశ్యానికి పులకించిపోయిన తాత ( మనసులో... ఎంతటి విచిత్రము. క్రొద్ది సేపటిక్రితమున్న భయమిప్పుడు లేదు. ఈ క్షణమున్న ఈ ఆనందం ఎప్పటివరకో ....!!! అనుకుంటూ )

పగలెల్ల వరిచేల ఁబనిపాటు  చేసి, ప్రొద్దు కుంకెడి వేళ ఁబొలమును వీడి
యిలుసేరి నూకల నిగురించి, వేడి సంగటి ఁగుడిచెడి సమయంబు నందు
సన్న చీఁకటి రూప సౌందర్య గరిమ మబ్బు వాఱుచునుండ, మాకుటీరంపు
ద్వారంబు కడ నిల్చి ధరణీ విభుండు ముసిముసినవ్వుల మొగమందగింప
సందె కబళెమె వేడె ....... ( ఈ పద్యం నైవేద్యం గ్రంధం నుంచి )

*******

4 కామెంట్‌లు:

Comment Form