8, ఏప్రిల్ 2012, ఆదివారం

మానవ సంబంధాలు. Leela's book





Alice Albinia, Empires of the Indus పుస్తక రచయిత్రి ద్వారా వెలువడిన "లీలాస్ బుక్ ( leela's book )" మహాభారతంలో కొద్ది పాత్రలను ఈ నాటి సమాజానికి అనుసంధానించి వ్రాసిన ఓ నవల. ఇది ఈవిడ మొదటి నవల లేదా రెండవ రచన. Empires of the Indus అనే పుస్తకం ఓ Non-fiction book.


 ఈ leela's book  చదవడం మొదలెట్టిన రోజు ఇదొక సుత్తి నవల అనుకున్నాను. మొదటి రోజు కథలోని పాత్రలు పెద్దగా అర్థంకాలేదు. హిందూ వ్యతిరేక వాది వ్రాసిన పుస్తకమనిపిస్తుంది. పుస్తకమంతా చదవడానికి సుమారుగా వారం రోజులు పట్టింది. Introductions, prefaces ఏమీ లేని ఓ 420 పేజీల పుస్తకం.


కథ ఇక్కడ చెప్పేస్తే ఈ నవల చదవాలనుకున్న వారికి ఉత్కంఠత తగ్గి చదివేటప్పుడు ఆత్రుత లోపిస్తుంది. మొదటి 250 పేజీలు చదవడానికి ఓ నాలుగు రోజులు పడితే, చివరి 150 పేజీలు ఓ రాత్రి కూర్చొని చదివేశంతటి ఆసక్తి వచ్చింది. నవలలో అక్కడక్కడా తెలియని పదాలు పంటికింద రాళ్ళలాగా తగిలినా సగం పుస్తకం చదివేటప్పటికి రచయిత్రి రచనా విధానం అర్థమౌతుంది కనుక మిగతా సగం సులభంగా చదివేయవచ్చు.


ఇక్కడ కథకంటే ఈ నవలా రచయిత అభిప్రాయాలను ముచ్చటించటం బాగుంటుంది.


రచయిత్రికి హిందూమత పైన ద్వేషం పెద్దగా కనిపించదు కానీ, ఇస్లాం మతంపై ప్రేమ కనిపిస్తుంది. ఎక్కడో ఇంగ్లాండ్ లో పుట్టి , న్యూఢిల్లీ లో ఓ పత్రికా విలేఖరిగా కొద్ది సంవత్సరాల అనుభవంతో భారతదేశ సమాజాన్ని, ఇక్కడి మతాలను, ఆచార వ్యవహారాలను ఇంత దగ్గరగా గమనించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ రకంగా మన చరిత్రగా చెప్పుకుంటున్న, మన పురాణాలలోని  పాత్రలను కొంతవరకూ పరిశీలించినట్లే అనిపిస్తుంది కానీ నాటి సామాజిక వ్యవస్థమీద పూర్తి అవగాహన లేదేమోనని కూడా అనిపిస్తుంది. కథ చివరికి వచ్చేటప్పటికి మన అభిప్రాయం నిజమా అన్న ప్రశ్నకూడా కలుగుతుంది. మహాభారత కాలంనాటి సమాజానికి, నేటి సమాజానికి వ్యత్యాసం ఎంతగా కనిపించినా  స్త్రీ,పురుష మధ్య సంబంధాలలో ఇప్పటికీ పెద్దగా వ్యత్యాసం కూడా లేదేమో నన్న భావం కూడా కలుగుతుంది. ఈ నాటి సింధూపరివాహక ప్రాంత ముస్లింలు కూడా హిందువులని సూచాయగా చెప్తుంది.


చాలా సునిశిత పరిశీలనా రచయిత అని చెప్పవచ్చు. మహాభారత వక్త వేదవ్యాస కు, నవలలో ఒక ముఖ్య పాత్ర వేదవ్యాస చతుర్వేదికి లింకు పెద్దగా సరిపోలేదు కానీ, కథలో పాత్రల అల్లిక అద్భుతం. అక్కడక్కడ మహాభారత ప్రదేశాలకు, రచయిత ఊహలోని ప్రదేశాలకు పోలిక బాగానే వుందనిపించింది. రచయిత హిందూమతంపై  తన అభిప్రాయాలను  శివప్రసాద్ శర్మ, అతని భార్య, వారి దగ్గర కుటుంబం ద్వారా  హేళనా స్వరం తో నవలలో బాగానే అల్లింది. నవల పూర్తయ్యేటప్పటికి ఊర్వశి ఒక ముస్లింని చేసుకోవడం ద్వారా నిజాయితీ పరురాలయినట్లు చూపినట్లనిపిస్తుంది. ఇక నవలా హీరోయిన లీల ద్వారా రచయిత ఏం చెప్పాలనుకున్నదో అది పాఠకుల ఊహకే వదిలేసింది. 


నిజానికి నవలమొదటిలో హిందూమతాన్ని విమర్శిస్తూ వ్రాస్తున్నట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. కథ మధ్యలోకి చేరుకొనేటప్పటికి కథలోని పాత్రలపట్ల విపరీతమైన ఆశక్తి మొదలౌతుంది. సమాజంలో మనం నిత్యము చూసే మనుషుల అంతరంగ జీవితాలను బట్టబయలు చేసినట్లనిపిస్తుంది. ఏది మంచో ఏది చెడో కూడా అర్థము కాకుండా అల్లిన నవల ఇది. అసలు మంచి చెడూ అన్నవి లేనేలేవు అన్నదే ఈ నవల సారంశం అనిపిస్తుంది. అలాగే పుట్టుకకు మరణానికి మధ్య మనమేమి చేస్తామన్నదే ముఖ్యమన్న సందేశమూ వుంది.


రచయిత్రికి ఇస్లాం మతం పై ప్రేమా లేక కరడు గట్టిన హిందూవాదులపై ద్వేషమా లేదా మానవ సంబంధాలు మతానికతీతమని చెప్పాలనుకున్నారా ? అన్నది మన ఆలోచనల్లో తప్పక మెదలాడుతూ వుంటుంది. తాను గడిపిన, తాను చూసిన, తను భాగమైన హిందూ సమాజపు ఢిల్లీ జీవితాన్ని రచయిత్రి అణువణువు వర్ణించింది. మన పెళ్ళిళ్ళు ఎంత కృతకంగా వుంటాయో చెప్పకనే చెప్పింది. సంస్కృత పండితుల అంతరాత్మలనూ ఆవిష్కరించింది. ఆర్యులు ఇక్కడివారే అని మనము ఋజువు చేయాలన్న తాపత్రయాన్ని కథలో భాగంగా చేర్చింది. తను బహుశా పరిశోధనలకోసం వ్రాసుకున్న మన పురాణ పాఠాలనూ అక్కడక్కడ తన అభిప్రాయలతో కలిపి నవలలో కూర్చింది. నవలంతా చదివాక నిజానికి హిందూ మతాన్ని విమర్శించడంకన్నా  పురాణాలను అల్లిన వారిని , వాటిలోని sugar coated కథలను ఈవిడ విమర్శిస్తుందన్న అభిప్రాయం బలపడుతుంది.


 శాంతినికేతన్ లో ఇందిరాగాంధి గడిపిన రోజుల గూర్చి రచయిత కొంత పరిశోధన చేసిందో లేకా ఇందిరాగాంధీ జీవితచరిత్ర చదివిందో కానీ కథలోని శాంతినికేతన్ భాగాన్ని చదివేటప్పుడు ఆ వివరాలు మన మనసులో తచ్చాడుతూ వుంటాయి కూడా. నాకైతే ఖరగ్ పూర్ లో వున్నప్పుడు ఇండియా టుడే లో వచ్చిన బసంతపంచమి వ్యాసంతో పాటు బెంగాల్ అమ్మాయిలూ చాలా చాలా సార్లు గుర్తుకొచ్చారు. ఆ బసంతపంచమిలో ఓ అమ్మాయి రూపంకూడా చాలారోజులకు మళ్ళీ వెంటాడటం ముదలెట్టింది.


కథ పూర్తయ్యాక మనల్ని ఆలోచనల్లోకి నెట్టివేసి సమాధానాలకోసం మీరే వెతుక్కోండి అని ఛాలెంజ్ చేసినట్లుగా ముగుస్తుందీ నవల. 


గెలుపన్నది ఎవరిది? కథ చెప్పేవానిదా?కథ వ్రాసినవానిదా? వ్యాసునిదా లేక గణేశ్/వినాయకునిదా? మీరా ఓడిందా లేక లీల గెలిచిందా? ఆర్యులెవరన్నది తేల్చడంలో శర్మ పాత్ర ఏమిటి? ఆర్యుడెవడన్నది తెలుసుకున్న శర్మ గెలిచాడా ఓడిపోయాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ పుస్తకం చదివిన తరువాత మీరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. తప్పక చదువవలసిన ఓ మంచి నవల.


అంతా చదివాక కొద్దిరోజులు కథలోని పాత్రలు కచ్చితంగా మనను వెంటాడతాయి.

3 కామెంట్‌లు:

  1. Thanks for introducing this book.

    I read her 'Empires of Indus'. Not only that I liked the book, but also I admired her for her efforts in writing that book. She had great risk-appetite.

    I thought she came out pretty fair & balanced in that book, as far as opinions are concerned.

    I couldn't find Leela in local B&N store, but will search it online now. Thanks

    రిప్లయితొలగించండి
  2. కుమార్, ఈ పుస్తకం అమెరికాలో ఈ సంవత్సరమే పబ్లిష్ అయింది. B&N లో మీకు దొరక్కపోవచ్చు. Amazon లో దొరకుతుంది. నవల పూర్తయ్యేటప్పటికి చాలా రకాల ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు మన సంతృప్తి కోసం బోలెడు సమాధానాలు చెప్పుకుంటాం.

    Empires of the Indus పై కూడా వచ్చేనెలలో వ్రాస్తాను.

    రిప్లయితొలగించండి
  3. భారారె గారు,
    Empires of the Indus పై రాస్తారా! గుడ్. will be waiting.

    అది చదివాకా ఆ పుస్తకం గురించి రాయాలని అనుకున్నాను. కాని ఎక్కడ ఒక టాంజెంట్ కనపడితే చాలు, ఆ డైరక్షన్ లో, ఓ irreversible point దాకా వెళ్ళిపోయే bad habit ఉన్న నాకు చాలా కష్టం అని డిసైడ్ అయిపోయ్యా :-)

    నేపథ్యం Indus river యే అయినా, ఆ పుస్తకం టచ్ చేసే, ప్రదేశాలూ, ప్రజలూ, చరిత్రా, సబ్జక్ట్సూ బోల్డంత!!!! మనం రాసేప్పుడు ఎక్కడ కొంచెం indiscipline గా ఉన్నా, వంపుల్లో పడి, దొర్లుకుంటూ పోయి కొత్త ఏరియాలో తేల్తాం:-)

    But yes, I will be eagerly waiting :-)

    రిప్లయితొలగించండి

Comment Form