15, ఆగస్టు 2019, గురువారం

రారండోయ్ రారండోయ్-- తండూరీ చాయ్ తాగండోయ్....:)

1993 వ సంవత్సరం.B.Tech ఐపోయి M.Tech లో చేరమని ఆహ్వానం రావడంతో గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా గాంధీనగరం గ్రామం నుంచి ఖరగ్ పూర్ కు బయలు దేరాను. బస్సులో విజయవాడదాకా వచ్చి హౌరా ఎక్స్ప్రెస్ కు రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. యువరక్తం. జనరల్ టికెట్ కొనుక్కొని టి.సి. కి డబ్బులిచ్చి ఏదో ఒక బెర్త్ రిజర్వ్ చేసుకోవచ్చులెమ్మని ధైర్యంతో కూడిన అనుభవం. విశాఖపట్టణంలో  B.Tech  చేసేటప్పుడు ఏదో ఒక ట్రైన్ పట్టుకొని రిజర్వేషన్ బోగీలో ఎక్కడం టికెట్ కలక్టర్ కరుణిస్తే అంతో ఇంతో డబ్బులిచ్చి ఆ పెట్టలోనే వుండండం లేదంటే దిగి జనరల్ బోగీలోకి మారడం బాగానే అనుభవముంది. అసలు అప్పట్లో నేను బొకారో ఎక్స్ప్రెస్ కు ఎక్కువగా ఇంటికి వస్తుండేవాడిని. ఎంతలా అంటే దానిపేరును మాఫ్రెండ్స్ భాస్కర్ బొకారా అని పిలుచుకునేటంతగా. B.Tech చదివిని మొదటి మూడేండ్లు మేము ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా జిల్లెళ్ళపాడు గ్రామంలో వుండేవాళ్ళము. ఈ ఊరికి పోవాలంటే అదొక పెద్ద ప్రహసనం. కారణం ఒంగోలులో దిగినాక, కనిగిరి బస్సు పట్టుకొని మొదట కనిగిరి చేరుకోవాలి. అక్కడనుంచి బస్సుకోసం నిరీక్షణ. కనిగిరి లో బస్సుదొరొకిన తరువాత ( కనిగిరి=వెదుళ్ళ చెరువు లేదా కనిగిరి-రంగన్నపల్లి ) ఓ గంట ప్రయాణం తరువాత తాడిచెట్ల దగ్గర దిగి ఓ రెండుకిలోమీటర్లు నడిచి జిల్లెళ్ళపాడు చేరుకోవాలి. విశాఖలో వున్న రోజుల్లో మొదటిసంవత్సరంలో మాఊరికి ఏ సమయంలో బయలుదేరితే త్వరగా చేరుకోవచ్చో ప్రయోగాలు చేసి చివరికి బొకారో రైలు ఎక్కితే అతి తక్కువ సమయంలో బస్సులకోసం ఎక్కువ నిరీక్షించకుండా ఇల్లు చేరుకోవచ్చని కనిపెట్టాను. :) అతితక్కువ సమయమంటే మరీ తక్కువ అనుకోకండి. కనీసం పదహారు/పదిహేడు గంటలు పట్టేది. అసలు బొకారో మొదటి ప్రయాణం నాకు బహు బాగా గుర్తు. ఆ మొదటి ప్రయాణంలోనే నేనెంతో ఇష్టపడి జీవితంలో మొదటిసారి కొనుక్కున్న  Vaction boots ఎవరో కొట్టేశారు. దాని గురించి మరో సారి.

ఇలా హౌరా ఎక్స్ప్రెస్ కు టికెట్ కొనుక్కొని విజయా డైరీ వాళ్ళ మజ్జిగ రెండు మూడు పేకెట్లు లాగించి స్వాతి,ఆంధ్రభూమి వార పత్రికలు కొనుక్కొని ఒక రిజర్వేషన్ బోగీలో ఎక్కాను. అనుకున్నట్లే రైలు లో ఖాళీ లేదు. ఎక్కిన భోగీలో ఎవరైనా కుఱ్ఱ పిల్లలు ఉన్నారేమో నని ఒక సింహావలోకనం చేశాను కానీ అంత ఆసక్తి గొలిపే మొఖాలెక్కడా కనపడలేదు :). రైలు ప్రయాణం మొదలైంది. కొద్దిదూరం పోయాక T.C వచ్చాడు. నా పరిస్థితి వివరించాను. ఏమనుకున్నాడో ఏమో విశాఖ దాకా ఖాళీల్లేవు అక్కడ ఏమైనా ఖాళీ వస్తే తప్పక ఇస్తానని మాట యిచ్చి అక్కడి వరకూ ఎక్కడో ఒక చోట సర్దుకొని కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు. వైజాగ్ దాకా ప్రయాణం కొట్టిన పిండి కాబట్టి సరదాగా గడిపేశాను. విశాఖ రాగానే T.C ని కలిసి బెర్త్ రిజర్వ్ చేసుకొని మిగతా ప్రయాణాన్ని సుఖాసీనుడనై
 ప్రయాణించి ఉదయం పది/పదిన్నర ప్రాంతానికి ఖరగ్పూర్ చేరుకున్నాను.

బెంగాలీ రాదు నాకు. హిందీ కొద్దికొద్దిగా వచ్చేది. దిగిన తరువాత వచ్చిన హిందీలో IIT కి వెళ్ళాలని అడిగితే ఎక్కడనుంచని అడిగాడు. ఆంధ్రా అని చెప్పా. అంతే స్వచ్చమైన తెలుగులో సంభాషణ మొదలెట్టాడు. అప్పటిదాకా ఖరగ్ పూర్ లో తెలుగువాళ్ళెక్కువని తెలియదు నాకు. అలా ఆజాద్ హాల్ చేరుకొని మరుసటిరోజు అడ్మిషన్ పూర్తిచేసుకున్నాను.

ఇంతకీ మట్టికుండలో టీ కి నేను చెప్పేదానికి సంబధమేమిటా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. అక్కడున్నరోజుల్లో తరచూ గోల్ బజార్ అనే మార్కెట్ కు కొత్తగా వచ్చిన తెలుగు పాటల కోసమో లేదా కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవటానికో లేదా ఎదో సినిమా చూడడానికో వెళ్ళేవాళ్ళము.అదిగో అక్కడ రుచి చూశాను తండూరీ చాయ్ ని మట్టి ముంతలో! ఆ రుచి నాకిప్పటికీ గుర్తే. ఆ మట్టి వాసన ఆ టీ రుచీ మర్చిపోవాలన్నా మరపురాదు.అది మొదలు ప్రతివారం లేదా ఖాళీ దొరికినప్పుడల్లా సైకిల్స్ మీద గోల్ బజార్ కు వెళ్ళి టీ త్రాగడం అలవాటైపోయింది అక్కడున్న సంవత్సరమున్నర రోజులూ!!

ఆ తరువాత మళ్ళీ మట్టిపాత్రల్లో టీ త్రాగిన జ్ఞాపకాలు లేవు. ఈ మధ్య అమెజాన్ లో ఏదో కొందామని వెతుకుతుంటే ఇవిగో ఇవి నాకంట పడ్డాయి. ఎగిరి గంతేసి ఆర్డర్ చేసి మళ్ళీ ఈ రోజు ఇంచుమించు అదే రుచితో టీ త్రాగుతున్నా...

తండూరీ చాయ్ కావాలా!!! ఆలస్యమెందుకు...మాయింటికి రండి :)









1 కామెంట్‌:



  1. చాయ్ చేసి తాగడానికి ఇంత కష్టపడి క్రిందా మీదా పడి హైరానా అయిపోయేరా ! మామోడీ గారితో చెప్పి వుండొచ్చు కదండీ :)


    రిప్లయితొలగించండి

Comment Form