9, నవంబర్ 2008, ఆదివారం

సాహిత్య హాస్య రస గుళికలు.

మన పూర్వ కవులకు ఎంత రచనా పాటవ మున్నా, ఎంత వాగ్థాటి వున్నా మన పల్లె పడుచుల ముందు ఘోరంగా ఓడిన సందర్భాలు కోకొల్లలు.నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల లో చదివే రొజుల్లో తెలుగు పంతుళ్ళు , నిజానికి భాషా పండితులు. (ఇప్పటి పరిస్థితి తారుమారు అని విన్నా).వాళ్ళు పఠాలు చెప్తూ మధ్యలో కొన్ని చమత్కారలు చెప్తూ వుండేవారు. వారు ప్రసాదించిన విద్యలో నుంచి కొన్ని హాస్య రస గుళికలు.

ముందుగా సంగీత స్వరాలను ఒక రసజ్ఞుడు కంద పద్యములో చెప్పి తన తృష్ణ ఎలా తిర్చుకున్నాడో చుడండి. మీకు సంగీతము వస్తే పాడుకోండి. ( ఏమండోయ్ అర్థము లేదనుకునేరు, పద్యానికి శుభ్రంగా అర్థము వుంది. కాకపొతే వాడిన అక్షరాలే సంగీత స్వరాలు)

మా పని నీ పని గాదా
పాపమ మా పాపగారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పనిగానిమ్మా !!

విజయ నగర రాజ్యం లో తెలుగు ఒక వెలుగు వెలిగిన సంగతి మనందరికీ తెలుసు కదా. అక్కడ ఒక పూవులమ్ముకునే ఆమెకు కవికి ఈ రకంగా సంభాషణ జరిగింది.
" వెలది నీ ఈ దండ వెల ఎంత? "
" నా దండకును వెలబెట్ట నెవ్వని తరంబు ?" అని పూలమ్మి చెల్లు మనిపించింది.
ఇక్కడ రసికుని దృష్టిలో "దండ" అంటే "జబ్బ" అని అర్థం. అందుకే ఆమె రెండర్థాలు వచ్చేలా నా దండకి ( పూలదండకి, నా జబ్బకి ) వెల కట్టడమెవరి తరం రా? అంది.

ఇలాంటిదే ఇంకొకటి. తన ఇంటికి అతిధి గా వచ్చిన ఒక అందగాడితో ఓ నెరజాణ యిలా అంటుంది.
ఇచట "నే" పరుండు,నిచ్చట అత్తగా
రిచట పరిజనంబు లెరిగి కొనుము
రాత్రి, నీకు కానరాను;నా శయ్యపై
తప్పి పడెదవేమొ దారికాడ!!

ఇదిగో నేను పడుకొనేది ఇక్కడ.రాత్రులు కాన రాక నా మీద తప్ప అత్తగారి మీద కాని, పని వాళ్ళ పైన గాని పదతావెమో జాగ్రత్త " అని హెచ్చరిస్తే ఇంక నా బోటి వాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది చెప్పండి?

చివరిగా కాళిదాసంతటి వడే ఈ సందర్భం లో నీళ్ళు నమిలాడు, మీరే చూడండి

యుక్తం కిం తవ శర్వరీశ ముఖ! మద్వేణీ సమాకర్షణం
వధ్యయా మహరత్తవ కుచద్వందం మదీయం మనః
వృత్యస్తం ననుశిక్షితం జహి జహి స్వామిన్ వచః సాధుతే
ఆగోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు!!

ఒక సుందరి చెరువులో స్నానం చేసి కుండతో నీళ్ళు తీసుకొని కాళిదాసుని ఓర చూపులు చూసుకుంటూ వెల్తుందట.కాళిదాసు కూడ ఊరుకొకుండా వెనకనే గబ గబ వెళ్ళీ జడపట్టుకొని లాగడు. ఆమె ఠక్కున వెనక్కి తిరిగి
" ఓరీ అందగడా ! నా జడ పట్టుకొని ఎందుకు లాగవు" అనే సరికి కవి గారికి ఏమి చెప్పలో తెలియక "నీ బిగువైన చనుదోయి నన్నా పని చేయించింది" అన్నాడట. వెంటనే ఆమె "తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాధుల్ని దండిస్తార?" అనేసరికి కాళిదాసుకేంటి నాతో పాటి మీకు కూడా మతి పోయిందా?

2 కామెంట్‌లు:

  1. ఇలాటి చమత్కార పద్యాలు ఎప్పుడు చదివినా నిత్య నూత్నంగా ఉంటాయి కదా!

    రిప్లయితొలగించండి
  2. ఎంత సరసంగా ఉన్నాయి. తెలుగు యింకా లోతుగా తెలుసుకోవాలనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి

Comment Form