14, డిసెంబర్ 2017, గురువారం

మహాభారత ఆదిపర్వము లోని ద్వితీయాశ్వాస కథా విశ్లేషణ

ఆదిపర్వం ద్వితీయాశ్వాసం చదివాక నాకొకటి అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ సామాన్య జనాల్లో ఈ నాడున్నట్టి హింశా ప్రవృత్తులు లేకుండా జీవించారంటే వారు రామాయణ భారతాది కథల్లోని సారాంశాన్ని గ్రహించి ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించి నడుచుకోవడమే నాటి సమాజ విజయానికి కారణమనిపిస్తుంది. ఈ ఆశ్వాసంలో (నాటి) సమాజానికి ఉపయోగపడే నీతులను అంతర్గతంగా చెప్పేటువంటి కథలు మనకు తారసపడుతాయి. ఇందులో ౧) పాములు, అనూరుడు,గరుత్మంతుడి పుట్టుక ౨) సముద్ర మథనం ౩) ఏనుగు,తాబేలు కథ (గజ కచ్చపముల కథ)  ౪) గరుత్మంతుడు  స్వర్గానికెళ్ళి అమృతం తేవడం ౫) వాలఖిల్యుల కథ  ౬) జరత్కారుని కథ  ౭) పరీక్షుత్తు ఎలా చనిపోయాడనే కథ  ౮)సర్పయాగము ౯) ఆస్తీకుడు సర్పయాగాన్ని మాన్పించే కథ  లున్నాయి.

బహుశా భారతకాలంనాటికే  ఆనాటి పూర్వ కథలను అంటే కృత,త్రేతా యుగకాలపు కథలను చెప్పటంలో కొంత అతిశయోక్తి కనపడుతుంది. యెప్పటిలాగే నాటి చదువుకున్న సమాజం మునులు కాబట్టి వారి వారి ఆధిపత్యాలను నిలబెట్టుకోవడానికల్లిన కథలు వారే కేంద్రంగా మనకు కనిపిస్తాయి.కథల్లో కేంద్రబిందువు వారే యై వారికొరకు వాళ్ళు కొన్ని అతీంద్రయ శక్తులనాపాదించుకొన్నా కథా సారాంశానికొచ్చేటప్పటికి మంచిని ప్రోత్సహించడమే కనిపిస్తుంది. రాజుల వద్ద లేదా కార్యార్థము మనమెవ్వరిదగ్గరకైనా పనికి వెళ్ళినప్పుడాపనిని ఎలా సాధించుకోవాలో కూడా ఈ ఆశ్వాస చివరిలో ఆస్తీకుడు జనమేజయ సర్పయాగాన్ని మాన్పించడం ద్వారా తెలుస్తుంది.

శ్రమ చేయడంతోనే ఫలితం దక్కదని దానికి కావలసిన తెలివి కూడా అవసరమని సముద్రమథనం కథలో తెలుస్తుంది. ఇది కచ్చితంగా రాక్షసులకు దేవతలు చేసిన మోసమే.ఇక్కడ దేవతలకు రాక్షసులకు విభేధాలేమిటో మనకు స్పష్టంగా తెలియదు కానీ సముద్రాన్ని చిలికేటప్పుడు వాసుకి ని మంథర పర్వాతానికి కవ్వపు తాడుగా చేసుకొన్నప్పుడు రాక్షసులు పాము తలవైపు వుండేటట్లు,దేవతలు పాము తోక ను పట్టుకొని చిలుకుతారు. విషము తలవైపు వుంటుంది కాబట్టి పోతే రాక్షసులే పోతారు. అదే గాక ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిన విష్ణువు (బ్రహ్మ కూడా ) సముద్రమథనంలో వచ్చిన యే ఒక్క దానిని కూడా రాక్షసులకు చెందకుండా అన్నీ దేవతలకే చెందేటట్లు చేస్తాడు.అమృతంతో సహా !. చివరికి విషయాన్ని గ్రహించిన రాక్షసులు యుద్ధంచేసి ఓడిపోతారు. ఈ కథలో నిజానికి రాక్షసులు దేవతలకు దక్కిన ప్రతిదానిలో అర్హులు, కానీ తగిన సమయస్ఫూర్తీ, సౌర్యము లేక పోవడం వల్ల కష్టపడినా ఫలితం దక్కదు. నేటికి కూడా ఇదే పరిస్థతి కదా !!

ఇక్కడ మనం మరో ముఖ్య విషయాన్ని గూర్చి చెప్పుకోవాలి. గరుడుడు అమృతం తేవడానికి స్వర్గానికెళుతూ నాకు బలం రావడంకోసం ఆహారాన్నిమ్మని తల్లియైన వినతను అడుగుతాడు. అప్పుడు వినత సముద్రగర్భంలో నున్న బోయవాళ్ళను (నిషాదులను) తినమని చెప్తూ బ్రాహ్మణులను మాత్రం తినొద్దని చెప్తుంది. బ్రాహ్మణులను ఎలా గుర్తించాలంటే ఎవడైతే గొంతులోనుండి క్రిందకు జారకుండా అగ్నివలె కాలుస్తాడో వాడిని బ్రాహ్మణుడని చెప్తుంది. ఇక్కడ బ్రాహ్మణులను చంపరాదని వారు ఉన్నతులని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గరుడుడు నిషాదులను తినేటప్పుడు ఒక బ్రాహ్మణుడు గరుడుని గొంతులోకి పోయి అడ్డుపడతాడు. ఇక్కడ కొంత సంవాదం జరిగిన తరువాత చివరికి బ్రాహ్మణుడు పెళ్ళి చేసుకోవడం ద్వారా  అపవిత్రు రాలైన బోయవనిత కూడా పవిత్రురాలైనట్టు చెప్పడం ద్వారా బ్రాహ్మణాధిక్యతను కథలో చొప్పించారు.

ఇక విష్ణువు సౌర్యపరాక్రమాలను గలవానిని గుర్తించి దగ్గరకు తీయటంలో నేర్పరని మనకు గరుత్మంతుడు అమృతం తేవడానికి స్వర్గానికి వెళ్ళిన సందర్భంలో కనిపిస్తుంది. అమృతానికి కాపలాగా వున్న దేవతలందరిని చిత్తు చేసి అమృతాన్ని తీసుకొని పోతుంటే విష్ణువు ప్రత్యక్షమై వరమివ్వడం లాంటి సన్నివేశాలు కార్యశూరులను గుర్తించి తనవైపు తిప్పుకోవడంలో నేర్పరితనం విష్ణువుకు ఎంతగానుందో తెలియచేస్తుంది. అలాగే ఓడిపోయిన ఇంద్రుడుకూడా శత్రువు బలవంతుడైనప్పుడు లొంగిపోయి అతనితో స్నేహాన్ని కోరుకోవడం ద్వారా మరింత నష్టాన్ని నివారించుకోగలుగుతాడు.

వినత, కద్రువ కథలో తల్లే తన మాట నెగ్గడంకోసం మోసం చేయమని చెప్పడం,తిరస్కరిస్తే శాపమివ్వటం పాములు ధర్మాధర్మాల మధ్య నలిగి పోవడం తుదకు శేషుడు నేను అధర్మాత్ముల దగ్గరుండనని వెళ్ళిపోవటం ద్వారా దుష్టులకు దూరంగా వుండమనే సారాంశాన్ని ఆ కథలో అంతరార్థం. అంతేకాకుండా వాసుకి తన ప్రమేయంలేకుండానే శాపానికి అర్హమై సర్పయాగంలో ప్రాణాలు కోల్పాతారని తెలిసినప్పుడు కుటుంబపెద్దగా బాధ్యత తీసుకొని దానికి పరిష్కారాన్ని కనుగొనడం ద్వారా తనకుటుంబాన్ని ఎలా రక్షించుకొన్నదో కూడా తెలుస్తుంది. 

వాలఖిల్యుల కథ ద్వారా మునులు లేదా నిర్బలులను చూసి వెటకారంచేస్తే యేమి జరుగుతుందో  గరుత్మంతుని ద్వారా ఇంద్రునకు తెలియచేసినట్లయింది. ఇక్కడ ప్రధానంగా ఇంద్రుని గర్వానికి ప్రతిగా వినత కడుపున కశ్యపునికి గరుత్మంతుడు పుట్టి స్వర్గాధిపతైన ఇంద్రుని గర్వాన్ని అణచడమనేది ప్రధానం.

జరత్కారుని కథ ద్వారా ఎంతటి తపస్సంపన్నులైనా  బిడ్డలు  లేకపోతే  ఉత్తమలోకాలు ప్రాప్తించవని చెప్పిస్తాడు. బహుశా ఆకాలంలో ఎంతమంది పుత్రులుంటే వారికి సమాజంలో అంత బలమేమో. 

పరీక్షుత్తు తక్షకుడి కాటుద్వారా చనిపోవటానికి కారణం తపస్సులో నున్న ముని మెడలో పామును అకారణంగా వేయటం.దానికి ఫలితము పరీక్షిత్తు చావు. ఇందులో నీతి విదితమే కదా.

ఇక చివరిగా జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తున్నప్పుడు ఆస్తీకుడొచ్చి దానిని మాన్పించడానికి చేసిన ప్రయత్నం నిజంగా ప్రతిఒక్కరు భారతాన్ని చదివి ఆస్వాదించవలసిందే. ఇక్కడ మనకు అధికారమున్న వారి దగ్గర యెలా మాట్లాడాలో తెలుస్తుంది. సన్నివేశాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. 

4 కామెంట్‌లు:

  1. నిజానికి రాక్షసులు దేవతలకు దక్కిన ప్రతిదానిలో అర్హులు...
    మీరెలా నిర్ణయం చేస్తారు? ధర్మం, న్యాయం, తర్క శాస్త్రాలు ఏమన్నా చదివారా? వాటిలో మహా మహులా? మీరు ఆ రాక్షసుల మధ్య ఎపుడన్నా ఉన్నారా? వాళ్ళు మనుషులను చీల్చి పీక్కుని తినే వారు.
    అధికారం కానీ, అతి విలువైనవి కానీ, దుర్మార్గులు, లోక కంటకులకు ఇస్తే ఏమౌతుంది.
    వాళ్లకు అవి దొరికివుంటే ఇప్పుడు మనుషులనే జాతి ఉండేదా? ఇనాటి లోకం ఇలా ఉండేదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత, ఈ విషయం చెప్పడానికి మీరుదాహరించిన గ్రంధాలేవీ చదువక్కరలేదు. ఒక పని లేదా వ్యాపారం ఇద్దరూ కలిసి చేసినప్పుడు దాని నుంచొచ్చిన ఫలాలూ ఇద్దరూ అనుభవించడం జరగాలి.అది జరగలేదు కాబట్టి ఇది ముమ్మాటికీ అధర్మమే. ఋషులు,రాజులు,గ్రంధకర్తలూ దేవతపక్షమే కాబట్టి వారికనుకూలంగా చరిత్రను వ్రాసుకొని వుండవచ్చు. అంతమాత్రాన దేవతలందరూ పత్తిత్తులనీ రాక్షసులందరూ దుర్మార్గులమని చెప్పలేము. ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారం వచ్చిన ఫలితానికిరుపక్షాలూ అర్హులే!

      తొలగించండి
  2. లోకాలను పాలించడం, కాపాడటం, ధర్మాన్ని కాపాడటం, దేవతల/ ఇప్పుడైనా, ఎప్పుడైనా మంచివారి కర్తవ్యం కనుక యుద్ధనీతిగా దేవతలు అలా చేసి వుంటారు.
    ముందు దేవతలు తల వైపే పట్టుకోబోతుంటే రాక్షసులే అహంభావంతో, మేమే ఎక్కువ అని, మేమే తల వైపు పట్టుకుంటామని తీసుకున్నారు. ఎవరు మోసం చేశారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యుద్ధనీతి ప్రకారం దేవతలే అమృతాన్ని పొందారంటే ఎటువంటి గొడవాలేదు. నిజానికి రాక్షసులు యుద్ధంచేసి ఓడిపోయారు.

      >>ముందు దేవతలు తల వైపే పట్టుకోబోతుంటే రాక్షసులే అహంభావంతో, మేమే ఎక్కువ అని, మేమే తల వైపు పట్టుకుంటామని తీసుకున్నారు

      ఈ విషయం ఆంధ్రభారతంలో లేదు. కాబట్టి ఇక్కడ దేవతలు తెలివిగా నడుచుకొన్నారనుకోవాల్సి వస్తుంది.

      తొలగించండి

Comment Form