3, డిసెంబర్ 2017, ఆదివారం

జగన్ ఇరవైనాల్గవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా ఈ రోజు జగన్ డైరీ లో నుంచి కొంత బాగం ఆపైన నా పద్యము

"ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలోంచి సాగింది. ఈ గ్రామానికి చాలా చారిత్రక ప్రాధాన్యం ఉందట. గ్రామంలోని చెరువు శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినదట. ఆ చెరువు గురించి తెలుసుకున్నప్పుడు నేను ఎంతో సంభ్ర మాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ రోజుల్లోనే రాజులు ఎంతో దార్శనికతతో భావి తరాల గురించి ఆలోచించి, ఆ ప్రాంత భౌగోళిక స్వరూప, స్వభావాలను దృష్టిలో పెట్టుకుని వర్షపాతం, భూగర్భ జల వనరులు తక్కు వగా ఉన్న ప్రాంతాల్లో చెరువులు తవ్వించా రు. అప్పటి పాలకులు ప్రజాసంక్షేమం గురించి ఆలోచించారు కాబట్టే ఇటువంటి మహత్కార్యాలు చేయగలిగారు. అదే బాటలో నడిచిన నాన్నగారు ఈ ప్రాంతానికి జలకళ తీసుకురావాలని సంకల్పించి, ఇక్కడి ప్రాజెక్టులను దాదాపు 80 శాతం పూర్తిచేశారు. కానీ ప్రజాసంక్షేమం పట్టని నేటి పాలకులు ఆ మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తిచెయ్యడం లేదు.

ఈ ప్రాంతంలో వర్షాలు పడితే ప్రజలు పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతారని నా దృష్టికి వచ్చింది. రాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్లని చదివిన చరిత్ర గుర్తుకు వచ్చింది. అంతటి సిరిసంపదలతో తులతూగిన ఈ ప్రాంతం నేడు కడు పేదరికంలో మగ్గుతోంది. ఈ ప్రాంతం, ఈ ప్రజల భవిష్యత్తు మార్చడం మనం సంకల్పించిన నవరత్నాలతోనే సాధ్యమని భావిస్తున్నాను. అందుకే నైరాశ్యంలో ఉన్న ప్రజలకు నవరత్నాలను విపులంగా వివరిస్తూ.. భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నాను.

పత్తికొండ నియోజకవర్గం బాగా వెను కబడిన ప్రాంతం. ఇక్కడి ప్రజలకు పెద్దగా ఆదాయ వనరులేమీ లేవు. భార్యాభర్తలు కూలి పనులు చేసుకోగా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకుని, బ్యాంకుల నుంచి నాన్నగారు ప్రారంభించిన పావలా వడ్డీ, సున్నా వడ్డీలకు రుణాలు తీసుకుని పిల్లల్ని చదివించుకున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించారు. ఇలా అప్పుడప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న మహిళలు, అధికారంలోకి వస్తే బేషరతుగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి అప్పులు తీర్చకపోవడంతో పూర్తిగా నష్టపోయారు. చంద్రబాబు తన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఈ రోజు వారందరూ డిఫాల్టర్లుగా మారారు. వాళ్ల రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. పైగా వీళ్లకి రుణమాఫీ పేరుతో ఇచ్చిన కొద్ది మొత్తాన్ని కూడా సీడ్‌ క్యాపిటల్‌గా చూపించి, మహిళల దగ్గర నుంచి మళ్లీ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో డ్వాక్రా ఉద్యమం పూర్తిగా బలహీనపడింది. ఈ ప్రభావం బాగా వెనుకబడిన ప్రాంతమైన పత్తికొండపై మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడి మహిళలు వారికున్న కొద్దిపాటి ఆదాయ వనరుని కూడా కోల్పోయారు."



సీ|| రాయలేలినయట్టి రాజ్యమ్మిది దొరువు చెరువుల ఖ్యాతిని జెంది నూరు
రతనాల రాశులు రహదారులందు వీసెలలెక్కనమ్మి ప్రసిద్ధి నొందె
కాలగతిన నేడు కడుపేదలమయి గతించిన సౌఖ్యమ్ము తిరిగి బడయ
మీచెంత కొచ్చితిమి జగనన్నా మావెతలు బాపు నాయకా దయన నీవు!

ఆ.వె|| కరువు కాటకముల కలతచెందెడిమిమ్ము
నాదు కొందు నేను నవరతనము
ల, యిదె మాట నాది లయకారుసాక్షిగ
పత్తి కొండ వాస పౌరు లార

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form