23, డిసెంబర్ 2017, శనివారం

గిరిక, సత్యవతుల అందాల వర్ణన. పరాశరుని గోకుడు :)

సందర్భం: చేది దేశ రాజైన ఉపరిచరమహారాజుకు ( వసువు )  శుక్తిమతీ నది కోలాహలం అనే పర్వతం వల్ల కలిగిన కొడుకూ,కూతురినీ యిస్తుంది.కూతురు పేరు గిరిక, కొడుకు పేరు వసుపదుడు. గిరికను ఉపరిచరమహారాజు పెండ్లి చేసుకొని వసుపదుని తనసేనాపతిగా చేసుకుంటాడు.కొంతకాలానికి గిరిక సమర్త అవుతుంది. అప్పుడామెకు మృగ మాంసం తెచ్చిపెట్టమని తల్లిదండ్రులు చెప్పటం వల్ల వసురాజు అడవికి వెళ్తాడు. ఈ సందర్భంలో గిరికను మనసులో తలచుకొనే సన్నివేశంలో సాగిన శృంగార వర్ణన యిది.

బహుశా ఆకాలంలో ఇలా రాజులకు భార్యలయ్యే వారి విషయంలో రాజుల విషయంలో వారి జన్మలకు యేవో ఇలాంటి అద్భుతాలనాపాదించారనుకోవాలి. ఇక్కడ గిరిక విషయంలోనూ, మత్స్యగంధి/యోజనగంధి ( సత్యవతి )  విషయంలోనూ యిలాంటి కథలే కనిపిస్తాయి. 

యిక ఈ పద్యాన్నాశ్వాదించండి. మూలనున్న ముసలోడు కూడా లేచి కూర్చుంటాడు :)

సీ||పలుకులముద్దును, గలికిక్రాల్గన్నుల తెలివును, వలుఁదచన్నుల బెడంగు
నలఘకాంచీపదస్థలములయొప్పును, లలితాననేందుమండలము రుచియు
నళినీలకుటిలకుంతలములకాంతియు, నెలజవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును, మెలుపును, గలుగు నగ్గిరికను దలఁచి తలచి

ఆ.వె||ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ
జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్కంద
మయ్యె నవనిపతికి నెయ్య మొనర

తాత్పర్యం: ఆ గిరికముద్దుపలుకులను, మనోజ్ఞంగా చలించే కన్నులను, స్థూలమైన చన్నుల సోయగాన్ని, పిఱ్ఱల ఒప్పును, మృదువైన ముఖ చంద్రబింబ కాంతిని,తుమ్మెదలవలె నల్లగా రింగులు తిరిగిన శిరోజాల వన్నెనూ, లేతయౌవనంలో ప్రకాశాన్ని, అలస విలాసాల అందచందాలను  తలచుకొని తలచుకొని గిరికాలగ్నమనస్కుడై ఆ వనము మధ్యలో రేతస్ఖలన మైంది.


ఇలాంటి దే మరో పద్యం. కాకపోతే ఇది పరాశరుడు మత్స్యగంధిని గోకడానికి తయారయ్యే సందర్భంలోది. వ్యాసుని జననానికి కారణమైన పద్యము.

సీ|| చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ, జిక్కనిచనుగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి
యభిలాష మేర్పడ నట్లుండగాఁ బల్కు, వేడ్కతో మఱుమాట వినగఁ దివురు
నతిఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడుఁగు

ఆ.వె|| నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు
లయ్యు గడువివక్త మయినచోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదురెండుఁ 
గాము శక్తి నోర్వఁగలరె జనులు

తాత్పర్యం: పరాశరుడు మత్స్యగంధినేత్ర సౌందర్యాన్ని చూచి మనసులో మెచ్చుకున్నాడు. ఆమె చన్నులను గోళ్ళతో రక్కాలనుకొన్నాడు.ఆమె సన్నటి నడుము సొగసును మనస్సులో నిలుపుకున్నాడు. ఆమె జఘనప్రదేశమందే దృష్టి నిలుపుకొన్నాడు.తనకోరిక వెల్లడి అయ్యేటట్లుగా మాట్లాడాడు.ఆమె ప్రత్యుత్తరాన్ని వినేందుకు ఉవ్విళ్ళూరాడు. అతి సిగ్గుతో నున్న ఆ కన్యమీదపడి ఆమె సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.
ఎంతశాంతులైనా.ఎంతజితేంద్రియులైనా, ఏకాంతస్థలంలో స్త్రీలకూటమి తటస్థిస్తే చిత్తచాంచల్యానికి లోనవుతారు.మన్మథుని బలాన్ని ఓర్వగల జనులున్నారా?

అదన్నమాట నన్నయ గంటంనుంచి జాలువారిన శృంగార వర్ణన. చివరి ఆటవెలది పద్యంలో మన్మథ తాపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదని కూడా తేల్చేసాడు.

1 కామెంట్‌:

Comment Form